ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయం మరోసారి తీవ్ర ఉత్కంఠగా మారింది. భీమిలి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలలో పెను సంచలనం సృష్టిస్తోంది. భీమిలి వైసీపీ ఇంచార్జిగా ఉన్న చిన్న శ్రీను హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో.. ఈ తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
భీమిలి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న చిన్న శ్రీను ఎగ్జిట్తో వైసీపీ కేడర్లో ఒక విధమైన శూన్యత ఏర్పడింది. ఈ ఖాళీని భర్తీ చేసి పార్టీని మళ్లీ గాడిన పెట్టగల సమర్థుడైన నాయకుడి కోసం అధిష్టానం వెతుకుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో బలమైన కేడర్, పట్టు ఉన్న అవంతి శ్రీనివాసరావు వైపు మెజారిటీ స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారు. భీమిలి నియోజకవర్గ వ్యాప్తంగా అవంతికి ఉన్న పాత పరిచయాలు, సామాజిక సమీకరణాలు పార్టీకి మళ్లీ కొత్త జోష్ నింపుతాయని వైసీపీ శ్రేణులు బలంగా భావిస్తున్నాయి.
గత 2024 డిసెంబర్ నెలలో అవంతి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేవలం వ్యక్తిగత కారణాల దృష్ట్యానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఏ ఇతర రాజకీయ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం భీమిలిలో మారిన పరిస్థితులు, స్థానిక నాయకత్వం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అవంతి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీ అధిష్టానంతో భేటీ అనంతరం ఆయన రీఎంట్రీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భోగట్టా.