ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో జనసేన నేత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు కీలక పదవి దక్కడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ‘ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ’ చైర్మన్గా నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా, ఆయనకు ఏకంగా కేబినెట్ హోదా కల్పించింది. ఈ నిర్ణయం పైకి కూటమి సఖ్యతగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా రక్తం చిందించిన సీనియర్ టీడీపీ నాయకులను, కష్టపడ్డ కార్యకర్తలను తీవ్రంగా అవమానించడమేనంటూ కిందిస్థాయి తమ్ముళ్లు లోలోపల రగిలిపోతున్నారు.
టీడీపీ కార్యకర్తలు ఇంతలా మండిపడటానికి బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లతో పాటు నందమూరి కుటుంబంపై నాగబాబు సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసహ్యకరమైన, దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణను ఉద్దేశించి, నందమూరి వంశాన్ని తక్కువ చేస్తూ ఆయన చేసిన తీవ్రమైన కామెంట్లు నందమూరి అభిమానులకు, టీడీపీ హార్డ్కోర్ కార్యకర్తలకు ఇంకా పచ్చిగా గుర్తున్నాయి.
అప్పట్లో పార్టీ పరువు కాపాడటానికి తాము సోషల్ మీడియాలోనూ, రోడ్ల పైనా ఫైట్ చేస్తుంటే.. తమను అంతలా దూషించిన వ్యక్తికి ఇప్పుడు నెత్తిన తెచ్చి కేబినెట్ ర్యాంక్ కుర్చీ వేయడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఐదేళ్ల పాటు తీవ్రమైన ఇబ్బందులు పడి, కేసులు ఎదుర్కొని, ఆస్తులు పోగొట్టుకున్న ఎంతోమంది నిజమైన టీడీపీ వీరవిధేయులకు నేటికీ నామినేటెడ్ పదవుల్లో సరైన ప్రాధాన్యత దక్కలేదు. అలాంటి కష్టపడ్డ నాయకులను పక్కనపెట్టి, కేవలం పవన్ కల్యాణ్ అన్న అనే ఒకే ఒక్క కారణంతో నాగబాబుకు ఇంతటి కీలకమైన పదవి కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదని క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటోంది. ఈ విధమైన పదవుల పంపకాలు భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో ఉన్న ఒరిజినల్ టీడీపీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, నాయకత్వం ఇలాంటి నిర్ణయాలపై పునరాలోచించాలని అంతర్గత వర్గాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.