ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, అడ్డతీగలలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తన సొంత క్యాడర్పైనే తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు అబ్జర్వర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
నియోజకవర్గంలోని కొందరు స్థానిక నాయకులు, కార్యకర్తలు నేరుగా పార్టీ అధిష్టానానికి తనపైనే ఫిర్యాదులు చేస్తుండటాన్ని ఎమ్మెల్యే శిరీషాదేవి తీవ్రంగా పరిగణించారు. సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. “క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయరు, ఓట్లు వేయించలేరు.. కానీ తిరిగి పార్టీ కార్యాలయంలో నా మీదే ఫిర్యాదులు చేస్తారా..? మీలో ఒక్కొక్కరి తాట తీస్తా” అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త మధ్యలో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. “రేయ్ కూర్చోరా.. కూర్చో.. మధ్యలో మాట్లాడకు, పిచ్చిపిచ్చి డ్రామాలు వేస్తున్నారా..?” అంటూ ఫైర్ అయ్యారు.
అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి, గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం గిరిజన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకున్న శిరీషాదేవి.. ఇప్పుడు ఇలా సొంత పార్టీ కార్యకర్తలపైనే బహిరంగంగా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే హెచ్చరికలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు ఇలా అబ్జర్వర్ల ముందే రచ్చకెక్కడంపై అటు అధిష్టానం, ఇటు కూటమి శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.