చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై బీసీసీఐ వేటు..?

టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై వేటు పడనుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండగా, ఆయనకు పొడిగింపు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం ఇద్దరు మాజీ ఆటగాళ్ల పేర్లను బోర్డు పరిశీలిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజాలు ప్రధాన రేసులో ఉన్నారు.

ఐపీఎల్‌లో మూడుసార్లు చొప్పున టైటిల్స్ గెలిచిన అనుభవం ఉన్న ఈ ఇద్దరిలో ఒకరికి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్రవారం జరగనున్న బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం లో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బుధవారం జరిగిన సెలెక్షన్ కమిటీ సమావేశమే అగార్కర్‌కు చివరిది కావచ్చని భావిస్తున్నారు. అయితే, వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై బోర్డు అంతర్గత వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయనే ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేరని గతంలో సెలెక్టర్లు చెప్పినట్లు వార్తలు వచ్చినా, ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో రోహిత్ 138 పరుగులతో అద్భుత సెంచరీ చేసి సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సెలెక్టర్ల ఆలోచనలకు భిన్నంగా రోహిత్‌ను జట్టులోకి తీసుకోవడం అగార్కర్‌పై ఒత్తిడి పెంచిందని, అందుకే ఆయనకు ఎక్స్‌టెన్షన్ ఇవ్వకూడదని బీసీసీఐలోని ఒక వర్గం గట్టిగా భావిస్తోందని తెలుస్తోంది.