తెలుగు మీడియా రంగంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగా ప్రచారం సాగుతోంది. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం పూర్తిగా మారిపోయిందని, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు తెరవెనుక భారీ పెట్టుబడులతో ఈ ఛానల్ను చేజిక్కించుకున్నారని మీడియా సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. తెలంగాణకు చెందిన ఒక అగ్ర వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడి చేతిలో ఉన్న సదరు ఛానల్ను అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.
యాజమాన్యం మారడంతో ఆ ఛానల్ అంతర్గత పరిపాలనలో శరవేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆ ఛానల్లో కీలక బాధ్యతల్లో ఉంటూ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీకి అనుకూలమైన లైన్ నడిపిన ఒక బలమైన కోర్ టీమ్ను అక్కడ నుండి పూర్తిగా సాగనంపుతున్నట్లు భోగట్టా. పొలిటికల్ స్క్రీన్ ప్లే పూర్తిగా మారబోతుండడంతో.. పాత టీమ్ స్థానంలో కొత్త సిబ్బందిని రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అంటున్నారు.
ఈ మార్పులన్నింటి నడుమ మీడియా రంగానికి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో ఒక టాప్ న్యూస్ ఛానల్కు హెడ్గా వ్యవహరించి, సంచలన ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన సదరు జర్నలిస్ట్.. ఈ కొత్త ప్రాజెక్టుకు సారథ్యం వహించబోతున్నారని సమాచారం. ఆయన నేతృత్వంలోనే సరికొత్త రూపంలో, కొత్త బ్రాండింగ్తో ఈ ఛానల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇన్సైడర్ టాక్. ప్రస్తుతానికి ఈ డీల్పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. తెరవెనుక జరుగుతున్న ఈ శరవేగ పరిణామాలు తెలుగు మీడియా స్పేస్లో హాట్ టాపిక్గా మారాయి.