జగన్ ప్యాలెస్‌లో కండువా.. నాలుగు నెలలకే వేటు..!

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును వైసీపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణా కమిటీ, ఆయనపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గత మే నెలలో తాడేపల్లి ప్యాలెస్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మోపిదేవి శ్రీనివాసరావుకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ముగిసిన తరుణంలో పార్టీలోకి వలసలు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో చూపించుకోవడానికి వైసీపీ ఈ చేరికను అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని మోపిదేవి శ్రీనివాసరావు భావించినప్పటికీ, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సీన్ పూర్తిగా రివర్స్ అయింది.

స్థానిక నియోజకవర్గ నేతలతో మోపిదేవి శ్రీనివాసరావుకు సఖ్యత కుదరకపోవడం, అంతర్గతంగా పార్టీ వ్యూహాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధిష్ఠానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జగన్ కండువా కప్పిన నాలుగు నెలలకే సస్పెన్షన్‌ వేటు పడటం ఇప్పుడు బాపట్ల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల నుంచి నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకత్వం దూరం అవుతోంది. అటు మోపిదేవి వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.