తాడేపల్లికి తమ్మినేని పుత్రరత్నం షాక్..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్లు, తాడేపల్లి స్క్రిప్ట్ రైటర్లకు ఉత్తరాంధ్ర నుండి గట్టి షాక్ తగిలింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ వారసుడు, ఆయన పుత్రరత్నం తమ్మినేని చిరంజీవి నాగ్ క్షేత్రస్థాయిలో ఉన్న పచ్చి నిజాలను మైక్ ముందు పెట్టి వైసీపీ పరువును బజార్న పడేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ.. పార్టీ క్యాడర్‌ను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటుంటే, ఈ తమ్మినేని వారసుడు మాత్రం “శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి సింగిల్ సీటు కూడా రాదు.. ఉత్తరాంధ్రలో పార్టీ గల్లంతే” అంటూ ఓ రేంజ్‌లో జోస్యం చెప్పేసి సొంత పార్టీ క్యాడర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

నిజానికి స్థానిక ఎన్నికల ముందే వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల పాపం క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ పిచ్చెక్కిపోతోంది. ఒక పక్క తమ్మినేని ‘వైసీపీ ఒక మహా సముద్రం’ అని మైకులు పగిలిపోయేలా స్పీచ్‌లు ఇస్తుంటే.. ఆయన సొంత ఇంట్లోనేమో “ఈ సముద్రంలో ఒక్క చుక్క నీరు కూడా మిగలదు” అని కొడుకు గారే తేల్చి పారేశారు. జిల్లాలో పార్టీ ఒకే ఒక్క సామాజిక వర్గం జేబులో ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్.. లోకల్ క్యాడర్‌ను మరింత అయోమయంలోకి నెట్టేసాయి. ఎన్నికల ముందు క్యాడర్‌కు భరోసా ఇవ్వాల్సింది పోయి, ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ధర్మాన సోదరులను టార్గెట్ చేస్తూ.. “గతంలో కిరణ్ ను ధర్మాన సోదరుల నుండి కాపాడింది మా నాన్నే” అని చిరంజీవి నాగ్ గతం తవ్వడం జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద కామెడీగా మారింది. విజయనగరంలో మజ్జి శ్రీను లాంటి వాళ్లు ఆల్రెడీ పక్కకు తప్పుకుంటే, ఇప్పుడు శ్రీకాకుళంలో తమ్మినేని ఫ్యామిలీ కూడా వైసీపీ జెండా పీకేసేలా కనిపిస్తోంది. మా నాన్న రాజకీయ జీవితానికి ఎప్పుడూ ‘ఫుల్‌స్టాప్‌లు’ ఉండవు, కేవలం ‘కామాలు’ మాత్రమే ఉంటాయంటూ తమ్మినేని వారసుడు హింట్ ఇచ్చేశారు. అంటే త్వరలోనే వీళ్లు కండువాలు మార్చేసి క్యాడర్‌కు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట.