హద్దులు మీరిన జస్టిస్ రాకేష్ కుమార్ 

Boundless Justice Rakesh Kumar
పదవీవిరమణకు ముందు ఒక్కరోజు హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పు అందరూ ఊహించిందే.  జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న వ్యక్తిగత కక్షను, ఏమీ చేయలేని నిస్సహాయతను వాంతులు చేసుకుంటూ నిష్క్రమించారు.  ఆయన ఇచ్చిన తీర్పు, ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనేకమంది సీనియర్ న్యాయవాదులు, న్యాయనిపుణులు రాకేష్ కుమార్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. 
 
Boundless Justice Rakesh Kumar 
Boundless Justice Rakesh Kumar
న్యాయమూర్తి అనేవాడు కూడా రక్తమాంసాలున్న సాధారణ మానవుడే.  ఆయనేమీ అరిషడ్వార్గాలను జయించిన ఆదిశంకరుడు కాదు.  వారికీ అన్ని బలహీనతలు ఉంటాయి.  అయితే ఒకసారి న్యాయమూర్తిగా ధర్మపీఠం మీద కూర్చున్నపుడు ఆయన నిష్పక్షపాతంగా న్యాయసూత్రాలను, చట్టాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తూ, ఇరుపక్షాల వాదనలను సహనంతో వింటూ భావోద్వేగాలకు గురికాకుండా, ఎలాంటి వ్యక్తిగత వైషమ్యాలు, అభిప్రాయాలకు గురికాకుండా తీర్పు చెప్పాలి.  న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు సమంజసమే  అని కేసు  ఓడిపోయినవాడు కూడా భావించేట్లు ఉండాలి.   న్యాయమూర్తులు భావోద్రేకాలు లోను కాకూడదని సుప్రీంకోర్టు అయిదారు సార్లు తీర్పులు ఇచ్చిందని సీనియర్  న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  
 
తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న శ్రీ పట్టాభి ఈ విషయమై ఒక చర్చాకార్యక్రమంలో మాట్లాడుతూ జస్టిస్ రాకేష్ కుమార్ తన పరిధులను అతిక్రమించారని, ఆయన ఇచ్చిన తీర్పు వేరెవరో రాసిన డ్రాఫ్ట్ లా కనిపించింది తప్ప నిష్పక్షపాతంగా ఉన్నట్లు లేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు.  అసలు కేసుకు ఏమాత్రం సంబంధం లేకుండా గూగుల్ లో ఖైదీ నంబర్ 6093 అని కొడితే జగన్ పేరు వచ్చిందని, ఆయన మీదున్న కేసుల లిస్ట్ వచ్చిందని తీర్పులో రాయడం ఆయన వ్యక్తిగతంగా “ఎవరి అభిప్రాయాలతోనో” ప్రభావితులు అయ్యారని, ఆ తీర్పు పాఠం మొత్తం ఎవరో రాసి ఇచ్చినట్లుగా ఉన్నదని స్పష్టం చేశారు.    అంతేకాకుండా న్యాయమూర్తులు కారులో ప్రయాణిస్తుంటే దారి పొడవునా మహిళలు నమస్కారాలు పెడుతూ, మోకాళ్ళ మీద నిలుచుని రాజధాని నినాదాలు చెయ్యడం రాకేష్ కుమార్ ను సెంటిమెంట్ తో ప్రభావితం చేసే దుర్మార్గమైన చర్య అని, ఒకరి ఏడుపులు పెడబొబ్బలు చూసి న్యాయమూర్తులు నిర్ణయాలకు రావడం ఊహించని విషయం అంటూ పట్టాభి దుయ్యబట్టారు.  
 
ఎన్నికల కమీషనర్ విషయం, శాసనమండలి రద్దు విషయం అసలు ఈ కేసులో ఒక అంశమే కానపుడు ఆ విషయాలను ప్రస్తావించడం, జగన్ మీదున్న కొన్ని కేసులను తొలగిస్తూ జీవో జారీ చేసిన విషయాన్నీ ప్రస్తావించడం పూర్తి అసంగతం…పైగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చెయ్యడం కూడా జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి వ్రాసిన లేఖ ఫలితమే అని వ్యాఖ్యానించడం ద్వారా రాకేష్ కుమార్ న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయేట్లు వ్యవహరించారని మరొక మాజీ  అడ్వొకేట్ జనరల్ శ్రీ  రామకృష్ణ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు.  న్యాయమూర్తులు ఒక కేసు విషయమై తీర్పు ఇవ్వడానికి ముందే అనుచితమైన, అసందర్భమైన వ్యాఖ్యలు చేసినట్లయితే ఆ వ్యాఖ్యల ప్రభావం తీర్పు మీద పడే అవకాశం ఉందని పిటీషనర్లు భావించినప్పుడు ఆ విషయాన్ని మర్యాదపూర్వకంగా న్యాయమూర్తికి విన్నవించి వారిని విచారణ నుంచి తప్పుకోమని కోరడం సర్వసాధారణంగా జరుగుతుందని, గతంలో తమ అనుభవంలో ఎన్నో ఇలాంటి సంఘటనలను చూశామని, అందుకు న్యాయమూర్తులు కూడా అంగీకరించి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయని ఆ సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు.  కానీ, రాకేష్ కుమార్ మాత్రం  అందుకు అంగీకరించకుండా తానె విచారణ జరుపుతానని భీష్మించడం న్యాయసూత్రాలకు విరుద్ధం అని ఈ సందర్భంగా న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.    
 
అసలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గూర్చి గూగుల్ లో చూడటం ఏమిటో రాకేష్ కుమార్ కే తెలియాలి.  జగన్ మోహన్ రెడ్డి అని గూగుల్లో చూడకుండా ఖైదీ నెంబర్ అని చూడటం ఏమిటి?  దీనివెనుక తెలుగుదేశం అధినేత, మరొక సీనియర్ న్యాయమూర్తి హస్తాలు ఉంటాయని చిన్నపిల్లలు కూడా అర్ధం చేసుకుంటారు.  ఏదో చేయాలని వచ్చి, ఏమీ చెయ్యలేక, తనమీద ఆశలు పెట్టుకున్నవారికి నిరాశ కలిగించి జస్టిస్ రాకేష్ కుమార్ విషణ్ణవదనంతో నిష్క్రమించాల్సి రావడం ఆయన చేసుకున్న స్వయంకృతం.  బీహార్ హైకోర్టులోనే ఆయన  కావలసినంత దుష్కీర్తిని సంపాదించుకున్నారు.    ఆయనకు ఎలాంటి కేసులు ఇవ్వకుండా ఆరునెలలు మూలన కూర్చోబెట్టి  ఒక “బాధ్యత” అప్పగించి ఆంధ్రప్రదేశ్ కు ఆయన్ను పంపించారు.  ఆ బాధ్యతను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేసినా “న్యాయం, ధర్మం” చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు.   తమ ఆగడాలను సహిస్తూ, భయపడుతూ ఉంటాడనుకున్న జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా తిరగబడటం, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, దానిమీద ప్రధాన న్యాయమూర్తి స్పందించడం, జస్టిస్ రమణను వివరణ కోరడం,  తన ఫిర్యాదును అఫిడవిట్ రూపంలో సమర్పించాలని జగన్మోహన్ రెడ్డిని కోరడం, ఆంధ్రా, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చెయ్యడం, అందులో ఆంధ్రా ప్రధాన న్యాయమూర్తిని కొండప్రాంతమైన, కేవలం ఆరు లక్షల జనాభా, ముగ్గురు న్యాయమూర్తులు కలిగిన సిక్కిం కు బదిలీ చెయ్యడం లాంటి పరిణామాలు ఏవీ జస్టిస్ రాకేష్ కుమార్ కలలో కూడా ఊహించి ఉండరు.  అందుకే ఆ ఆక్రోశాన్ని మొత్తాన్ని తన తీర్పులో రంగరించి తన వృత్తి జీవితానికి మచ్చ తెచ్చుకున్నారు.  రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్ట్ పక్కన పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.    
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు