వైఎస్ జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎంత కఠినంగా ఉంటారో అందరికీ తెలుసు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కేసులు పడినా వెనక్కు తగ్గరు. స్వయంగా హైకోర్టు చెప్పినా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళడం, అక్కడ వీలుకాకపోని పక్షంలో అన్నీ దారులు మూసుకుపోతే అప్పుడు జగన్ డేసిషన్ మార్చుకునేవారు. రంగుల జీవో, నిమ్మిగడ్డ నియామకం లాంటి విషయాలు ఇందుకు ఉదాహరణ. తప్పక వెనక్కి తగ్గాల్సి రావడంతో తగ్గారు. ఇప్పటివరకు సుమారు 70కి పైగా అంశాల్లో ప్రభుత్వానికి కోర్టులు అభ్యంతరం తెలిపింది అంటే వైఎస్ జగన్ పంతం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వైఎస్ జగన్ చిత్రంగా మద్యం ధరల విషయంలో మాత్రం చాలా త్వరగా వెనక్కితగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
హైకోర్టు ఇక మీదట ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి 3 ఫుల్ బాటిళ్లను తెచ్చుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రంలో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. అదీకాక మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను విపరీతంగా పెంచి ఇలా చేస్తే మందుబాబులు తగ్గుతారని రీజన్ చెప్పింది వైఎస్ జగన్ సర్కార్. అయితే మందు తాగేవారి సంఖ్య తగ్గిందో లేదో తెలీదు కానీ అనర్థాలు మాత్రం చాలానే జరిగాయి. మద్యం తాగేవారిలో 75 శాతానికి పైగా చీప్ లిక్కర్ సేవించేవారే ఉన్నారు. పెరిగిన ధరలతో చీప్ లిక్కర్ ను కాస్ట్లీ మద్యం కొన్నట్టు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చింది.
దీంతో మందుబాబుల జేబులు, ఇళ్లు గుల్లయ్యాయి. తాగడానికే అప్పులు చేసే పరిస్థితి. దీంతో మద్యం ధరల పెంపుపై విమర్శలు వెల్లువెత్తాయి. అది కాస్త ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేక భావన మొదలయ్యేలా చేసింది. ఇది చాలదన్నట్టు సరిహద్దుల్లో మద్యం స్మగ్లింగ్ ఊపందుకుంది. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే జనాలకు పరిచయం ఉన్న మేలు రకం మద్యాన్ని కొందరు ఏపీలోకి అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఈ స్మగ్లింగ్ ఎంతలా జరిగిందంటే నెలకు సగటును 56,000 బల్క్ లీటర్ల మద్యం పట్టుబడేది. పట్టుబడేదే ఇంత ఉంటే తెలియకుండా లోపలికి చేరేది ఇంకేంత ఉంటుందో ఊహించడం కష్టం.
సుమారు 14 వేల మంది మీద స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక పెరిగిన ధరలతో చీప్ లిక్కర్ కూడ కొనలేక శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ తాగి సుమారు 20మంది మరణించారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ధరల పెంపు నిర్ణయం కేవలం ఆదాయం పెంచుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడలేదనే భావన ప్రజల్లో కలిగింది. దీన్ని పసిగట్టిన ప్రభుత్వం ధరలు తగ్గించింది. క్వార్టర్ రూ. 120కి మించని మద్యం మీద క్వార్టరుకు రూ. 30, క్వార్టర్ రూ.120 నుండి 150 ఉండే రకాల మీద క్వార్టరుకు రూ.70 తగ్గించారు. ఈ నష్టాన్ని కవర్ చేయడానికి క్వార్టర్ రూ.600 ఉండే రకాల మీద క్వార్టర్ మీద రూ.140 పెంచింది.