రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా పాలన చేయకుండా హత్యా రాజకీయ పరిపాలన చేస్తుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు, హత్యలతో వైకాపా ప్రభుత్వం సమాధానం చెబుతుందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకులు ఇసుకమాఫియా, ఇళ్ల స్థలాల కుంభకోణాలకు పాల్పడుతుంటే వాటిని బయటపెట్టడం, ప్రశ్నించడం ప్రతిపక్షాల విధిగా పేర్కొన్నారు.తప్పును బయటపెడితే సరిదద్దుకోవాల్సిందిపోయి హత్యలకు పాల్పడటం కిరాతక చర్యగా పేర్కొన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ కార్యకర్తను నిర్దాక్షిణంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్యగాఅభివర్ణించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ దారుణంగా విఫలైమైందని పేర్కొన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని విమర్శించారు. పోలీసులు అధికారపార్టీకి దాసులుగా మారడం, నేరస్తులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆక్షేపించారు. తక్షణం హంతకులను కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్దం కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. కొండబిట్రగుంట, పిఠాపురం, అంతర్వేదిలో హిందూ ఆలయాల ధ్వంసం కేసుల్లో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆవేదన చెందారు.వైకాపా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కారణంగానే హిందూ ధర్మంపై దాడులు, విధ్వంసాలు కొనసాగుతున్నాయని భావించాల్సి వస్తోందన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా హిందూ ధర్మంపై దాడులు ఆపకుంటే హిందువుల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సివస్తోందని హెచ్చరించారు.