ఆంధ్ర ప్రదేశ్ : గత నాలుగు రోజుల నుండి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై మాట తప్పిందని, రూ. 3000 ఇస్తామని చెప్పి కేవలం రూ. 2250 మాత్రమే పెంచిందని ఆరోపించారు. రామానాయుడు మాటలపై మంత్రి కొడాలి నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేవలం రూ. 50 మాత్రమే ఇచ్చారని.. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి రూ. 200లకు పెంచారని వివరణ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక తొలుత కేవలం రూ. 1000 మాత్రమే ఇచ్చేవారన్నారు. అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ నవరత్నాలు ప్రకటించిన అనంతరం చంద్రబాబు పింఛన్ రూ. 2000లకు పెంచారని గుర్తుచేశారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా రూ. 2250 అందజేస్తున్నారన్నారు. ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతామని సీఎం జగన్ పాదయాత్రలోనూ మ్యానిఫెస్టోలోనూ చెప్పారని ఇప్పడు అదే చేస్తున్నారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శకి జగన్ సమాధానమిస్తూ… సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అతడిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని, రామానాయుడు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఏం చెప్పారో అందుకు సంబంధించిన వీడియోలు కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు. తమది మాటతప్పే ప్రభుత్వం కాదని.. మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అదే చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ డబ్బులు పెంచబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. వృద్ధులకు పింఛన్ వయసును 65 నుంచి 60కు తగ్గించామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2250 పెంచామని.. జులై 8 దివంగత నేత వైఎస్సార్ జన్మదినం రోజున మరో రూ.250 పెంచుతాం.. మొత్తం రూ.2500 చేస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో కేవలం 44 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని తాము 61 లక్షలమందికి ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.