ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై అధికార మరియు ప్రతిపక్ష పార్టీలే కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నానా అగచాట్లు పడుతుంది. ఇక ఇటీవలే రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటూ ఉండడమే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపేలా ఉద్యోగ సంఘాల నేతలు కూడా కరోనా టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చేస్తున్న ప్రకటనపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ‘అయోధ్య రామమందిర’ నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇంతకు ముందు పనిచేసిన ఉద్యోగులు రాజ్యాంగ స్ఫూర్తితో త్యాగాలకు సిద్ధపడి పనిచేశారని వ్యాఖ్యానించారు. అలాంటి అధికారులను అందరూ గుర్తుంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉద్యోగులు ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం లేకపోవచ్చని ఎల్వీ అభిప్రాయపడ్డారు.
ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు.. మనం రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో తమ రక్షణకు సంబంధించిన అన్ని సౌకర్యాలను నిర్భయంగా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అడిగి పొందాలని ఆయన సూచించారు. అంతకముందు కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనడం తమ ప్రాణాలకు సంబంధించిన అంశమని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, మాకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని, టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేము అనే వారిని వదిలేసి విధుల్లో పాల్గొనదలచిన మిగిలిన ఉద్యోగులతో ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చని ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామరెడ్డి అన్నారు.