వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలులో ఎంత ఖచ్చితంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఖజానాలో మేజర్ షేర్ ఈ పథకాల అమలుకే ఖర్చు చేస్తున్నారు. నిధులు లేకపోతే అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు విక్రయించైనా జనం ఖాతాలో డబ్బు వేయాలని నిర్ణయించుకున్న సీఎం వరుసగా పథాకాలను అమలుపరుస్తూ వస్తున్నారు. ఇటీవలే వైఎసార్ రైతు భరోసా కింద తొలివిడత సహాయం కింద 2,800 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమైంది.
ఇక తాజాగా ఈరోజు రెండో విడత వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆటో, టాక్సీ ఉన్నవారికి 10,000లు ఖాతాలో వేశారు. మొత్తం ఈరోజు 2.62 లక్షల మంది లబ్దిదారులు ఈ సహాయాన్ని పొందారు. ప్రణాళిక ప్రకారం అక్టోబరులో ఈ సహాయాన్ని అందించాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది ఆటో, టాక్సీ డ్రైవర్లు గత రెండు నెలలుగా బేరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది గ్రహించిన ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ముందుకి తెస్తే ప్రయోజనం ఉంటుందని భావించి ఇప్పుడే అమలుచేసింది. ఇందుకోసం 262.49 కోట్లు ఖర్చు చేశారు.
గత యేడాది కంటే ఈసారి 37,756 మంది అదనంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందుకోవడం విశేషం. ఎప్పటికప్పుడు కొత్త లబ్దిదారులకు చోటు కల్పిస్తూ ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చేయడంలో సర్కార్ పనితీరు బాగుంది. ఇక త్వరలో రానున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్బంగా పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నారు.
