ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా సస్పెన్షన్లో ఉన్న వీరిద్దరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ వేర్వేరుగా జీవోలను విడుదల చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ఇద్దరు అధికారులు త్వరలోనే విధుల్లో చేరనున్నారు.
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో తప్పుడు రికార్డులు సృష్టించి, నిబంధనలకు విరుద్ధంగా ఆమెను అరెస్టు చేసి వేధించారనే ఆరోపణలపై 2024 సెప్టెంబర్లో వీరిద్దరిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి వీరి సస్పెన్షన్ను ప్రభుత్వం కాలానుగుణంగా పొడిగిస్తూ వచ్చింది. అయితే, ఇటీవల ఈ అధికారుల సస్పెన్షన్ గడువు ముగియనుండటంతో, ఆగస్టు 24న తమ సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ వారు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. వీరి విజ్ఞప్తిని, అలాగే డీజీపీ అందించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, సాంకేతిక మరియు పరిపాలనాపరమైన సమీక్షల అనంతరం సస్పెన్షన్ను ఎత్తివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలను తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ, వారికి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వలేదు. జెత్వానీ కేసులో వారిపై కొనసాగుతున్న శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు, సీఐడీ క్రిమినల్ విచారణ యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఆయా దర్యాప్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తుది విచారణాంశాలకు లోబడే ఈ సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయం ఉంటుందని పేర్కొంది. విధుల్లోకి చేరిన ఈ ఇద్దరు అధికారులకు ప్రభుత్వం త్వరలోనే కొత్త పోస్టింగులను కేటాయించనుంది.