వైఎస్ కుటుంబానికి ఆప్తుడు.. ఆళ్ళ నానీ పొలిటికల్ హిస్టరీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ డిప్యూటి సిఎం, ఏలూరు సీనియర్ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణ వార్తతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఎంతో సుదీర్ఘమైనది, అలాగే ఏలూరు నియోజకవర్గంతో ఆయనకు విడదీయరాని బంధం ఉంది. ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి నమ్మకమైన నేతగా ఆయన గుర్తింపు ఉంది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, 2017లో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించారు.

వైఎస్ జగన్ క్యాబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు ప్రజల ఆదరణను సంపాదించిపెట్టాయి. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అనంతరం, ఆయన వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటీవల ఫిబ్రవరిలో ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. టీడీపీలో చేరి క్రియాశీలకంగా మారుతున్న తరుణంలోనే ఈ విషాదం జరగడం గమనార్హం. ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.