విజయనగరం జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్సీపీకి చెందిన కీలక నేత ‘చిన్న శ్రీను’ అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత జిల్లా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అందరూ భావించారు. చిన్న శ్రీను రూట్ మార్చడంతో, ఆయన వెనుకే వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, నియోజకవర్గాల్లోని ముఖ్య అనుచరులు కూడా పెద్ద ఎత్తున సైకిల్ ఎక్కుతారని అందరూ అంచనా వేశారు. కానీ, చిన్న శ్రీను టీడీపీలోకి వచ్చి రోజులు గడుస్తున్నా.. ఆయన వెంట నడిచేందుకు వైసీపీ కీలక నాయకులు ఎవరూ రాలేదు.
క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్ ఎక్కడికక్కడే ఉండిపోవడంతో, చిన్న శ్రీను రాకతో జిల్లా టీడీపీలో పెద్దగా వలసల జోష్ కనిపించలేదు. సరిగ్గా ఇదే సమయాన్ని అనుకూలంగా మార్చుకుని, జిల్లాలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవడానికి స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. చిన్న శ్రీను చేరికతో సంబంధం లేకుండా, తానే స్వయంగా గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. ఇందులో భాగంగానే దత్తిరాజేరు మండలం పరిధిలో వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సారథ్యంలో భారీ చేరికలు జరిగాయి.
మరడాం, మర్రివలస, అడవికొత్తవలస గ్రామాలకు చెందిన సుమారు 130 కుటుంబాలు వైసీపీని వీడి మంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ మారిన వారిలో పలువురు మాజీ వార్డు మెంబర్లతో పాటు గ్రామాల్లో పట్టున్న వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. చిన్న శ్రీను పార్టీలోకి ఒంటరిగానే వచ్చారనే టాక్ వినిపిస్తున్న తరుణంలో… క్షేత్రస్థాయిలో పార్టీని తానే స్వయంగా నడిపిస్తూ, వలసల జోరుతో తన సత్తా చాటడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించడమే లక్ష్యంగా, సీనియర్ నాయకులను కలుపుకుంటూ మంత్రి వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు ఇప్పుడు విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి.