వయోపరిమితి 44 ఏళ్లకు, డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఊహించని భారీ తీపి కబురు అందించింది. APPSCతో పాటు రాష్ట్రంలోని ఇతర రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి ఏకంగా 44 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ వయోపరిమితి సడలింపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, పోలీస్, ఎక్సైజ్, ఫైర్ వంటి యూనిఫాం సర్వీసుల విషయంలో ఓసీ అభ్యర్థులకు కేవలం రెండేళ్ల పెంపు మాత్రమే వర్తింపజేశారు. చాలా కాలంగా వయస్సు ముదిరిపోతోందని ఆందోళన చెందుతున్న లక్షలాది మంది ఆస్పిరెంట్లకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చినప్పటికీ, దీని వెనుక పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉందనే చర్చ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. ఇటీవల డీఎస్సీ పరీక్షల నిర్వహణ, సిలబస్ మార్పులు, అంతర్గత ప్రక్రియల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా విపక్షాలు, కొన్ని నిరుద్యోగ సంఘాలు ముమ్మరంగా ప్రచారం చేశాయి.

ఈ ప్రచారం నిరుద్యోగ యువతలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు టాక్. డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థుల్లో అత్యధికులు వయోపరిమితి చివరి దశలో ఉన్నవారే కావడం, వారంతా ఇతర నాన్-యూనిఫాం (గ్రూప్-1, గ్రూప్-2, సచివాలయం) పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే కేటగిరీకి చెందిన వారే. ఈ నేపథ్యంలో, డీఎస్సీ వివాదం వల్ల జరిగిన పొలిటికల్ డ్యామేజ్‌ను కవర్ చేయడానికి మరియు యువతను కూల్ చేయడానికి ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఏ ఎన్నికల్లోనైనా యువత, నిరుద్యోగుల ఓట్లే అత్యంత కీలకం. డీఎస్సీ అలజడి వల్ల ఎక్కడ నిరుద్యోగులు తమకు వ్యతిరేకంగా ఓటేస్తారోనన్న ముందస్తు అప్రమత్తతతోనే ప్రభుత్వం ఈ పదేళ్ల వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని తెరపైకి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిరుద్యోగులను శాంతింపచేయడమే కాకుండా, రాబోయే భారీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా పాత అభ్యర్థులకు మళ్లీ ఛాన్స్ ఇచ్చి తమ వైపు తిప్పుకోవాలనే సంకేతాలను ప్రభుత్వం స్పష్టంగా పంపింది. ఏది ఏమైనా, రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ.. సుదీర్ఘ కాలంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులకు మాత్రం ఈ 44 ఏళ్ల ఏజ్ లిమిట్ నిర్ణయం ఒక వరం లాంటిదేనని చెప్పాలి.