టీమిండియా కంబ్యాక్‌పై భువనేశ్వర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులో తన పునరాగమనం, జట్టుకు దూరం కావడంపై తొలిసారి నోరు విప్పాడు. ప్రముఖ క్రీడా విశ్లేషకుడు జతిన్ సప్రూ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022 నవంబర్ తర్వాత భారత్ తరఫున ఆడని 36 ఏళ్ల భువనేశ్వర్.. తాను జట్టులో లేని సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను పంచుకున్నాడు. తాను దేనినీ నిరూపించుకోవడానికి ఆడటం లేదని, అయితే మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే సంతోషిస్తానని స్పష్టం చేశాడు.

జట్టు నుంచి తప్పుకున్న తొలినాళ్లలో త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తానని సెలక్టర్లు లేదా యాజమాన్యం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని భువి వెల్లడించాడు. “మొదట్లో కొన్ని సిరీస్‌ల వరకు నాకు ఆశ ఉండేది, ఎందుకంటే నాకు ఫోన్ చేసి రాబోయే రెండు సిరీస్‌లలో అవకాశం ఉంటుందని చెప్పారు” అని భువి గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వారు చెప్పిన మాటలకు, క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలకు పొంతన లేదని తాను గ్రహించానని తెలిపాడు. వారు చెప్పింది అబద్ధమని అర్థమయ్యాక నిజం తెలుసుకుని మానసిక ప్రశాంతత పొందానని, ఆ కష్టసమయంలో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని పేర్కొన్నాడు.

మరోవైపు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు సార్లు టైటిల్స్ గెలవడంలో భువి కీలక పాత్ర పోషించారు. ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్ 2025లో 17 వికెట్లు తీసిన అతను, 2026 సీజన్‌లో ఏకంగా 28 వికెట్లతో చెలరేగి కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో పర్పుల్ క్యాప్ మిస్ చేసుకున్నాడు. ఈ అద్భుతమైన ఫామ్ కారణంగా భువనేశ్వర్ కుమార్ మళ్లీ భారత టి20 జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తరఫున ఇప్పటివరకు 229 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భువి.. 294 వికెట్లతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.