ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, సీనియర్ మోస్ట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులంతా పరుగుల పెడతారని జనాలు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. అధికారుల తీరు చూస్తుంటే అసలు సీఎం మాటకు కనీస విలువ లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కలెక్టర్ల సదస్సు లాంటి అత్యంత కీలకమైన మీటింగ్కే కొంతమంది అధికారులు డుమ్మా కొట్టేయడం చూస్తుంటే.. వీరికి ముఖ్యమంత్రి అంటే భయమా, లేక “ఆయన చెబుతుంటారు.. మనం వింటుంటాం” అనే లైట్ మైండ్సెట్టా అని సెటైర్లు పేలుతున్నాయి.
క్లాస్ పీకడానికి స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాల్సి రావడం, గైర్హాజరైన వారిపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ సాయి ప్రసాద్కు ఆదేశాలు జారీ చేయాల్సి రావడం చూస్తుంటే.. బాబు గారి మార్క్ అడ్మినిస్ట్రేషన్కు అధికారులు ఎలా గండి కొడుతున్నారో క్లియర్గా అర్థమవుతోంది. ఇక ఈ మీటింగ్లో మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేసిన అధికారులను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారట.
నిజానికి ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లు త్వరగా కదలడం అనేది కనీస బాధ్యత.. కానీ మన ఏపీ అధికార యంత్రాంగం పుణ్యమా అని, సకాలంలో పని చేయడమే ఒక పెద్ద ‘అద్భుతం’లా మారిపోయింది. అందుకే బాబు గారు కూడా “అబ్బో.. రెండు రోజుల్లోనే ఫైల్ క్లియర్ చేశారా.. ఎంత గొప్ప పని” అన్నట్లు సర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెట్టే అధికారుల తీరు మారకపోతే.. ఇక ఈ ‘స్పీడ్ గవర్నెన్స్’ కేవలం ప్రెస్ నోట్లకే పరిమితం అవుతుందని విమర్శలు వస్తున్నాయి.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇకపై ఫైళ్ల నిర్వహణ కేవలం ‘ఆన్లైన్’ ద్వారానే జరగాలని, ‘మాన్యువల్’ ఫైళ్లు పెడితే తీవ్రంగా పరిగణిస్తామని సీఎం గారు వార్నింగ్ ఇచ్చారు. ఈ డిజిటల్ విప్లవం ముచ్చటపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 1995 నుంచే ఐటీ టెక్నాలజీ గురించి లెక్చర్లు దంచిన చంద్రబాబు నాయుడు గారికి.. 2026 లో కూడా ఇంకా “ఆన్లైన్ లోనే ఫైళ్లు పెట్టండి బాబోయ్” అని అధికారులను బ్రతిమిలాడాల్సి రావడం ఒక పెద్ద వెటకారం. సిస్టమ్ మారాలి, స్పీడ్ పెరగాలి అని సీఎం గారు మైకులు పట్టుకుని నెత్తీ నోరూ మొత్తుకుంటుంటే.. అధికారులు మాత్రం “మీరు ఆదేశాలు ఇస్తూ ఉండండి.. మేము నివేదికలు రాస్తూ ఉంటాం” అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.