రివ్యూల ఖర్చుతోనే సగం ‘స్వర్ణాంధ్ర’ అయిపోయేలా ఉందే..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ‘8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్’ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ రివ్యూ మీటింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ఎస్పీలు, ఉన్నతాధికారులు కదిలివచ్చారు. అయితే, ‘రివ్యూలు కాదు.. రిజల్ట్ కావాలి’ అని సీఎం గంభీరంగా ఆదేశాలు ఇస్తున్న తరుణంలో.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ రెండు రోజుల ముచ్చట కోసం అవుతున్న ఖర్చు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.

ప్రతీ సారి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పేరిట కనీసం ఆరు కోట్లకు పైగా ప్రజాధనం మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చవుతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ రెండు రోజుల సదస్సు కోసం జరిగే ఏర్పాట్లు, తాజా హడావిడి చూస్తుంటే అసలు బడ్జెట్ లోటు ఎవరికి ఉందో అర్థం కావడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒకపక్క రాష్ట్రానికి నిధుల కొరత ఉందంటూనే, మరోపక్క జిల్లా జిల్లాల నుండి విచ్చేసే ఈ వీఐపీల కోసం ఫైవ్ స్టార్ హోటళ్లలో లగ్జరీ వసతులు, కాస్ట్లీ కార్ల కాన్వాయ్‌లు సిద్ధం చేశారు.

వీటన్నింటికీ తోడు సచివాలయంలో వడ్డించే మెనూ ఖర్చుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విదేశీ ప్రతినిధులకు సైతం కుళ్లు పుట్టేలా రకరకాల వంటకాలు, ఆర్గానిక్ ఫుడ్స్, కార్పొరేట్ క్యాటరింగ్ పేరిట లక్షల రూపాయల బిల్లులను కేవలం భోజనాల కోసమే తగలేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు మరియు ప్రభుత్వ పెద్దలు కలిసి కూర్చుని ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ రోడ్‌మ్యాప్, ఫైళ్ల క్లియరెన్స్ వంటి మహాత్తర విషయాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారట.

కానీ, ఈ సమీక్షల వల్ల రాష్ట్రంలో పనులు ఎంతవరకు ముందుకు సాగుతున్నాయనేది దేవుడెరుగు కానీ, ఒక్కో మీటింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు మాత్రం పెద్ద మొత్తంలో ‘బొక్క’ పడుతోందని సామాన్యుడు వాపోతున్నాడు. ప్రతీ చిన్న విషయానికి ఆన్‌లైన్‌లో ‘ఈ-ఆఫీస్, ఆర్టీజీఎస్’ అంటూ డిజిటల్ విప్లవం గురించి లెక్చర్లు ఇచ్చే నాయకులు, కలెక్టర్ల మీటింగ్ మాత్రం ఇలా ఆరు కోట్ల ప్రజాధనంతో ఇంత లగ్జరీగా నిర్వహించడం భలే విడ్డూరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వెటకారపు పోస్ట్‌లు హల్‌చల్ చేస్తున్నాయి.