ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి, సైకిల్ ఎక్కేసిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు, మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తన కూతురు సిరి సహస్రతో కలిసి ఏకంగా గోవా రాజభవన్కు క్యూ కట్టడం ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసి ఆయన పాదపద్మాలకు నమస్కరించి, ఆశీస్సులు దండుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైకి మాత్రం విజయనగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే ఈ పెద్దాయన సలహాలు తీసుకోవడానికి వచ్చామని బిల్డప్ ఇస్తున్నా, అసలు కథ మాత్రం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయనగరం మేయర్ సీటు లేదా ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడానికేనని టాక్ నడుస్తోంది. నిన్నటివరకు వైసీపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీని తిట్టిపోసిన నోటితోనే, ఇప్పుడు రూటు మార్చి అదే టీడీపీ పెద్దాయన చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూసి సొంత పార్టీ తమ్ముళ్లే ముక్కున వేలేసుకుంటున్నారు.
నిజానికి చిన్న శ్రీను టీడీపీలోకి రావడంపై ఇప్పటికే జిల్లా తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి పొగలు గక్కుతుండగా, ఈయనగారు మాత్రం ఏకంగా గోవా వెళ్లి సీటు కోసం గట్టిగానే కర్చీఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిళ్లలో వెటకారాలు నడుస్తున్నాయి. ఎలాంటి షరతులు లేకుండానే పార్టీలోకి వచ్చానని ప్రెస్ మీట్లలో నీతులు చెప్పిన చిన్న శ్రీను, చేరిన నాలుగు రోజులకే ఆశీస్సుల పేరుతో ఇలా రాజభవనం మెట్లు ఎక్కడం వెనుక ఉన్న అసలు రంగు బయటపడిందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఒకవైపు మేనమామ బొత్స సత్యనారాయణ ఇక్కడ వైసీపీ మీటింగ్లో మేనల్లుడు జంప్ అయ్యాడని కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఈయన మాత్రం అక్కడ గోవా బీచ్ల పక్కన పదవుల కోసం పొలిటికల్ ఈక్వేషన్లు కుదుర్చుకోవడంలో బిజీగా ఉండటం ఈ ఎపిసోడ్లో అసలైన హైలైట్. మొత్తానికి విజయనగరం మేయర్ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో, గోవా గవర్నర్ కాళ్లపై పడి చిన్న శ్రీను అండ్ కో చేస్తున్న ఈ కొత్త రాజకీయ నాటకం ఉత్తరాంధ్ర జనాభాకు భలే వినోదాన్ని అందిస్తోంది.