ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రజాపాలనలో సజావుగానే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నా… క్షేత్రస్థాయి రాజకీయాల్లో మాత్రం అంతర్గత అసంతృప్తులు తారస్థాయికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ గట్టిగా నడుస్తోంది.
కోటికి పైగా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ భారీ క్యాంపెయిన్లో… కూటమి ఉనికిని కాదని, కేవలం ఒకే ఒక్క పార్టీ రంగును మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లడంపై జనసేన శ్రేణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ ఇంటింటి ప్రచారంలో కేవలం ‘తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలన’గా మాత్రమే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ… లబ్ధిదారులకు అందుతున్న పథకాలు, ప్రజా సంక్షేమం మొత్తం కేవలం ఒకే పార్టీ ఖాతాలోకి వెళ్లేలా ప్రచార శైలి ఉండటంపై పవన్ కళ్యాణ్ అసహనంతో ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం సాధించిన విజయాల్లో లేదా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల వెనుక జనసేన భాగస్వామ్యం, పవన్ కళ్యాణ్ కృషి కూడా సమానంగా ఉన్నప్పటికీ, ఎక్కడా జనసేన పేరును లేదా లోగోలను సరైన రీతిలో ప్రొజెక్ట్ చేయడం లేదనే భావన జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. కోటి ఇళ్లకు పైగా రీచ్ అవుతున్న ఇంతటి మైలేజ్ ఉన్న కార్యక్రమంలో… రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే ఉందనే యాంగిల్ను ప్రజల మైండ్లోకి బలంగా పంపేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారనే టాక్ నడుస్తోంది. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి, కేవలం వన్-సైడ్ పబ్లిసిటీ వైపు మొగ్గు చూపడం భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య గ్యాప్ను పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే అంతర్గత చర్చలు జరిపారని, రాబోయే రోజుల్లో కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టమైన వివరణ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.