నటుడు, తేదాపా ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్-తెలంగాణ ముఖ్యమంత్రి భేటీలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ స్పీడ్ లోనే ఏపీలో వైకాపా ప్రభుత్వం కూడా పడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే వైకాపా నేతలు మండిపడ్డారు. తాజాగా వైకాపా ఎమ్మెల్సీ ఇక్భాల్ బాలయ్యకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని బాలయ్య ఎలా అంటారు? వైకాపాకి ఎన్ని సీట్లు ఉన్నాయో? టీడీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఆయనకి అసలు తెలుసా? అని ప్రశ్నించారు. గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అయిపోతుందన్న విషయం టీడీపీ నేతల్లో చాలా మందికి అర్ధమైంది. కానీ బాలకృష్ణకు ఇంకా సీన్ అర్దమవ్వలేదని ఎద్దేవా చేసారు.
విలువలు కట్టుబడిన సీఎం కాబట్టి జగన్ పాలన బాగా సాగుతుందన్నారు. బాలయ్య ఏం మాట్లాడుతారో తెలియదు. ఏం చేస్తారో తెలియదు. అప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని హిందీలో దుర్భాషలాడారు. ఇప్పుడేమో ఇండస్ర్టీపై సంబంధం లేని వ్యాఖ్యలతో పాటు, తమ పార్టీ పైనా అర్ధం లేని వ్యాఖ్యలు చేసారని ధ్వజమెత్తారు. ఓసారి ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటే మంచిదని మండిపడ్డారు. సినిమా వాళ్లు ఆయన్ను చర్చలకు పిలవలేదు అన్న బాధ ఆయన మాటలను బట్టి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎవరైనా ఎక్కడైనా హుందాగా నడుచుకుంటే ఎందుకు పిలవరు? ఎందుకు మర్యాద ఇవ్వరు. ఇవన్నీ నడవడికను బట్టే ఉంటాయని ఆక్షేపించారు. మరి వీటిపై బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
అలాగే మహానాడు పైనా ఇక్బాల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పేరుకే మహానాడు..కానీ అందులో అన్నీ మాయలే అన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తే నమ్మే రోజులు పోయాయన్నారు. వాస్తవాలు ప్రజలు దగ్గరుండి చూస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం బీసీలకు ఎంత న్యాయం జరిగిందో? వైకాపా అధికారంలోకి వచ్చాక? ఎంత ప్రధాన్యత ఇచ్చామో ఆ వర్గం నాయకులు, నేతలు చూస్తున్నారు. బీసీల గురించి చంద్రబాబు అనవసరంగా టెన్షన్ పడాల్సిన పనిలేదని…బీసీలకు చేయాల్సినవన్నీ వైకాపా అధికారంలో ఉండగానే చేసి చూపిస్తుందన్నారు.