ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్ కు చెక్..! చట్ట సవరణకు ప్రతిపాదనలు..!!

ఈ-కామర్స్‌ సంస్థలకు భారత ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. దీంతో ఇకపై ఫ్లాష్ సేల్స్ పై నిషేధం విధించినా ఆశ్చర్యం లేదు. వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చే క్రమంలో జులై 6లోపు దీనిపై సూచనలు, సలహాలు తెలిపే వీలుంది. భారత్‌లో ఈ-కామర్స్‌ సంస్థ తప్పనిసరిగా పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య మండలి (డీపీఐఐటీ) దగ్గర పేరు నమోదు చేసుకుని ఉండాలి.

రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను వినియోగదారులకు జారీచేసే ఇన్వాయిస్‌ ఆర్డర్‌పై కనిపించేలా ముద్రించాలి. లీగల్‌ పేరు, ప్రధాన కార్యాలయం, వెబ్‌సైట్‌ పేరు, శాఖల వివరాలు,  ఈ-మెయిల్‌, కస్టమర్‌ కేర్‌, ఫిర్యాదుల పరిష్కారించే అధికారి ల్యాండ్‌, మొబైల్‌ఫోన్‌ నెంబర్లను తన వెబ్‌సైట్‌లో ఉంచాలి. వ్యాపార పద్ధతుల్లో విపరీత పోకడలకు వెళ్లకూడదు. కస్టమర్లను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇవ్వొద్దు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యను బట్టి కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలి.

వినియోగదారుల హక్కుల చట్టంలోని నిబంధనలను అమలుచేసేందుకు చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాలి. ఆఫీసర్ భారత్‌లోనే నివసిస్తూ ఉండాలి. అధికారి వివరాలను వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో ప్రముఖంగా కనిపించేలా ఉంచాలి. వారి పేరు, ఫోన్‌ నెంబర్‌, కంప్లైనింగ్ డిటైల్స్ అక్కడే వెల్లడించాలి. ఆ వ్యక్తి 24×7 అందుబాటులో ఉండే వ్యక్తి నెంబర్‌ అందించాలి. విదేశీ వస్తువులను విక్రయించే క్రమంలో వస్తువుల దిగుమతి ప్రదేశం.. కొనుగోలుదారులు, ఇక్కడ విక్రయించే వారి వివరాలు పొందుపరచాలి.

ఫ్లాష్‌ సేల్స్‌ ను సంస్థలు నిర్వహించేందుకు వీల్లేదు. ఈ-కామర్స్ వేదికపై థర్డ్ పార్టీ నిర్వహించే ఫ్లాష్ సేల్స్ పై నిషేధం లేదు. సంస్థ వినియోగదారుడిగా చెప్పుకంటూ వస్తు, సేవల నాణ్యత గురించి రివ్యూలు ఇవ్వకూడదు.. పోస్ట్ చేయకూడదు. రిటర్న్‌ పాలసీ, రిఫండ్‌ డేట్, ఎక్స్ఛేంజ్‌ డేట్, ఎప్పటిలోపు ఉపయోగించాలి, వారెంటీ, గ్యారెంటీ, డెలివరీ, షిప్‌మెంట్‌, రిటర్న్‌ షిప్‌మెంట్‌ ఖర్చుల గురించి స్పష్టమైన సమాచారం పొందుపరచాలి.