Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ సామాజికపరమైన అంశాల విషయంలో మాత్రం ఆయన స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.
చిరు రాజకీయాల్లో లేకపోయినా పార్టీలతో, నాయకులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. బీజేపీతో మంచి సఖ్యత ఉంది. అయినా ఆయన బీజేపీని క్వశ్చన్ చేస్తూ స్పందించారు. కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న దేశానికి సంజీవనిలా మారింది.
రోజులు 100 టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. మహారాష్ట్రకు 150 టన్నుల ఆక్సిజన్ ఇక్కడి నుండే వెళ్ళింది. ఇంతటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని అమ్మేయడం మంచి ఆలోచన కాదని చిరు అంటున్నారు. మొదటి నుండి విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న చాలామంది సినీ సెలబ్రిటీలను మద్దతు కోరుతున్నారు.
కానీ స్టీల్ ప్లాంట్ చుట్టూ రాష్ట్ర, జాతీయ రాజకీయాలు ముడిపడి ఉన్నందున మన పెద్ద హీరోల ఎవ్వరూ నోరు మెదపలేదు. ఏం మాట్లాడితే ఎవరు నొచ్చుకుంటారోనని సైలెంట్ అయిపోయారు. అలా అందరూ సేఫ్ జోన్లో ఉన్న టైంలో మెగాస్టార్ చిరు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని అనడంతో జనం మిగతా హీరోలు కూడ నోరు విప్పి మాట్లాడవచ్చు కదా.. ఏవేవో విషయాల మీద లెక్చర్లు దంచే స్టార్లు నిజమైన అవసరం వచ్చినప్పుడు ఎందుకు నోరు మెదపరు అంటూ చురకలు వేస్తున్నారు.