మోడీ పాలనలో మరో మూడు బ్యాంకులకు మూడింది 

మోడీ సర్కార్ ధ్యేయమల్లా ఒక్కటే.  ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం.  పెట్టుబడుల ఉపసంహారణ, ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది.  ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు పలు సంస్థలను అమ్మకానికి పెట్టిన ప్రభ్యుత్వం ప్రధానంగా బ్యాంకింగ్ రంగం మీద కన్ను వేసింది.  ఇప్పటికే పలు ప్రభుత్వ బ్యాంకులను ఒకదాంట్లో ఒకటి విలీనం చేసిన కేంద్రం ఇప్పుడు ఏకంగా అమ్మకాలకే పూనుకుంది.  బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.  ముందుగా నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను  టార్గెట్ చేశారు.  బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్  బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. 


ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను అమ్మకానికి పెట్టే పనిలో ఉంది కేంద్రం .  మొదటి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోపు వీటిలో ఎలాగైనా రెండు బ్యాంకులను అమ్మేయాలని చూస్తోంది.  ఇలా ప్రభుత్వ బ్యాంకులను అమ్మితే ఉద్యోగుల నుండి, ఉద్యోగ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం సహజం.   అందుకే ఉద్యోగులు తక్కువగా ఉండే బ్యాంకులనే ఎంచుకుంటోంది.  అమ్మదలుచుకున్న ఈ బ్యాంకుల్లో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.  అందుకే ఈ బ్యాంకులను ఎంచుకుంది ప్రభుత్వం.  ఇవన్నీ నష్టాల్లో ఉన్న బ్యాంకులే కాబట్టి కొనడానికి ప్రైవేట్ వ్యక్తులు అంత త్వరగా ముందుకురారు.  అందుకే వారికి ఎర వేయడానికి కేంద్రం భారీగా లాభాల్లో ఉన్న ఇంకొక ప్రభుత్వ బ్యాంకును అమ్మదల్చుకుంటున్నట్టు చెబుతున్నారు. 

అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్.  నీరవ్ మోడీ వేల కోట్లలో మోసం చేసినా కూడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తట్టుకోగలిగింది.  అంత భారీ సంక్షోభం ఎదురైనా  ఇప్పటికీ లాభాల్లోనే కొనసాగుతోంది.  దీన్నిబట్టి ఆ బ్యాంక్ సామర్థ్యం, నెట్ వర్త్, కస్టమర్ల సంఖ్య, ఆస్తుల విలువ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.  దీన్నిగనుక అమ్మకానికి పెడితే కార్పొరేట్ వ్యక్తులు గద్దల్లా ఎగబడతారు.  ఆ ఉత్సాహంలోనే  కొద్దిపాటి నష్టాల్లో ఉన్న మధ్యస్థాయి బ్యాంకులను కొనడానికి ఆసక్తి చూపుతారనేది కేంద్రం స్ట్రాటజీ కావొచ్చు.  ఏదైతేనేం బీజేపీ ప్రభుత్వం తన టర్మ్ పూర్తయ్యేనాటికి ప్రభుత్వానికంటూ ఏమీ మిగిల్చేలా కనబడట్లేదు.  Modi, BJP,