ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇక లేరు!

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కళాతపస్వి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు.

ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం ‘శంకరాభరణం’. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు.

సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా ఆయనను వరించింది. కళాతపస్విగా ఆయన పేరుతెచ్చుకున్నారు. విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశారు.

సినీ ప్రస్థానం సాగిందిలా… కె.విశ్వనాథ్ చెన్నైలోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన జేవీ సోమయాజులతో చేసిన శంకరాభరణం ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే కె విశ్వనాథ్ దర్శకుడుగా పేరు సంపాదించాడు. కే విశ్వనాథ్ దర్శకుడుగానే కాకుండా నటుడిగా నటించాడు ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో ఆయన కథానాయకుడు హరికృష్ణకు తండ్రిగా నటించాడు. తర్వాత ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో హీరోయిన్ కాజల్ కు తాతగా నటించారు. ఠాగూర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ లో బాలకృష్ణకు తండ్రిగా నటించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో త్రిష కు తాతగా నటించాడు ఈయన ఎల్వి ప్రసాద్, బి.యన్.రెడ్డి తరువాత దాదాసాహెబ్ ఫాల్కే పొందిన తెలుగు సినిమా దర్శకుడు.

ఈయన సినిమాల్లో శాస్త్రీయ సంగీతం అందరినీ అలరించింది సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది. ఈయన దాదాసాహెబ్ ఫాల్కే 2016లో అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు, ఎల్వి ప్రసాద్ , బొమ్మిరెడ్డి నాగిరెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తరువాత ఈయన దాదాసాహెబ్ ఫాల్కే పొందారు.

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.

విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత: విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. కెరీర్ చివర్లో దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించాడు.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు: ఆత్మ గౌరవం, అల్లుడు పట్టిన భరతం, సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, సప్తపది, ఆపద్భాందవుడు, నేరము శిక్ష, శృతిలయలు, స్వాతికిరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, అమ్మ మనసు, శుభలేఖ, శుభోదయం, శుభ సంకల్పం, సిరివెన్నెల, సాగరసంగమం, స్వయంకృషి, జననీ జన్మభూమి, చిన్నబ్బాయి (1997), సూత్రధారులు, స్వరాభిషేకం, జీవిత నౌక, కాలాంతకులు, జీవన జ్యోతి, ప్రేమ బంధం, చెల్లెలి కాపురం, నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు ఉండమ్మా బొట్టు పెడతా, కలసొచ్చిన ఆదర్శం, ప్రైవేటు మాస్టారు, శారద, కాలం మారింది, ఓ సీత కథ, శుభప్రదం, మాంగల్యానికి మరో ముడి.

కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు: లాహిరి లాహిరి లాహిరిలో (2002), అల్లరి రాముడు (2002), సంతోషం (2002 సినిమా), వజ్రం శుభసంకల్పం, సంతోషం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, నీ స్నేహం, ద్రోహి అతడు, సీమ సింహం, లక్ష్మీనరసింహ, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా, కుచ్చికుచ్చి కూనమ్మ, స్టాలిన్, జీనియస్ (2012)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు: 1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం, 1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం – సప్తపది, 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు సాగరసంగమం, 1986 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు – స్వాతిముత్యం, 1988 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు శృతిలయలు, 2004 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు స్వరాభిషేకం, 1992 – రఘుపతి వెంకయ్య పురస్కారం, 1992 – పద్మశ్రీ పురస్కారం, 2016 : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.