‘బలగం’ తరవాత మరో గ్రామీణ నేపథ్యం… ప్రజలకు దగ్గరగా ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’

యువ నటుడు సుహాస్‌ ఇంతకు ముందు ‘కలర్‌ ఫోటో’ సినిమాతో వచ్చీరాగానే జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. తరువాత ‘రైటర్‌ పద్మభూషణ్‌’ అనే సినిమాలో కూడా కథానాయకుడిగా చేసాడు, ఆ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది, కానీ నిర్మాతకి డబ్బులు వచ్చాయి అన్నారు. ఇప్పుడు అదే సుహాస్‌ ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు అతని రెండు సినిమాలకి ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం అయితే, ఈ సినిమాతో దుష్యంత్‌ అనే ఇంకో దర్శకుడు పరిచయం అయ్యాడు.

ఈ సినిమాకి గీతా ఆర్ట్స్‌ లాంటి పెద్ద సంస్థ వెనకాల నిలుచుంది. ధీరజ్‌ మొగిలినేని ఈ సినిమాకి నిర్మాత. ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్‌ బన్నీ వాస్‌, దర్శక నిర్మాత వెంకటేష్‌ మహాలు ఈ సినిమాకి సమర్పకులుగా వున్నారు. ఈ సినిమా కథా నేపధ్యం దర్శకుడు దుశ్యంత్‌ తన స్వీయ అనుభవాలు, అలాగే తన ఊర్లో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తీశానని విడుదలకి ముందు చెప్పారు. నటి శరణ్య ఇందులో ఇంకో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కథ ఒక పీరియడ్‌ డ్రామా అంటే 2007 ప్రాంతంలో అంబాజిపేట అనే గ్రామంలో జరిగినది.

ఆ ఊర్లో పెద్ద మనిషిగా వున్న వెంకట్‌ (నితిన్‌ ప్రసన్న), అదే వూర్లో చాలామందికి అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసుకుంటూ ఉంటాడు. అలా వూర్లో చాలామందిని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అతని దగ్గర డబ్బులు తీసుకున్న ఆ ఊరి గ్రామస్థులు కొందరు అతను అసలు డబ్బులు ఎప్పుడు కట్టమంటాడా అని అతనికి భయపడుతూ బతుకుతూ ఉంటారు. అదే గ్రామంలో మల్లి (సుహాస్‌) తన కులవృత్తిని చేసుకుంటూనే మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు.

అతను అక్క పద్మ (శరణ్య) కవలలు, పద్మ చదువుకున్నది, అందుకని అదే ఊర్లో వున్న స్కూల్‌ లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంటుంది. పద్మకు వుద్యోగం ఇప్పించింది వెంకట్‌ అని, అతనికి పద్మకి మధ్య ఏదో సంబంధం ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. ఇదిలా ఉండగా మల్లి, వెంకట్‌ చెల్లి లక్ష్మీ (శివానీ) ని ప్రేమిస్తాడు, ఆమెకి కూడా మల్లి అంటే ఇష్టం.

మల్లి, పద్మ ల పుట్టినరోజు నాడు ఒక సంఘటన జరుగుతుంది, అది ఇంకో సంఘటనకి దారితీస్తుంది. ఇక ఇక్కడ నుండి కథ మొదలవుతుంది. ఆరోజు ఏమైంది, డబ్బు, పరపతి, అధికులం అనుకున్న వెంకట్‌ ఏమి చేసాడు, అతను చేసిన పనికి మల్లి, పద్మలు ఎలా ప్రతిస్పందించారు, లక్ష్మి, మల్లిల ప్రేమ సఫలం అయిందా, చివరకి ఈ సంఘటనలు అన్నీ ఎటు దారితీసాయి అనేది సినిమా కథ.

ఈమధ్య కాలంలో ‘బలగం’ తరువాత సహజసిద్ధమైన కథతో, సన్నివేశాలతో, తెరమీద నటులు కాకుండా ఆయా పాత్రలు మాత్రమే కనపడే సినిమా ఏదైనా వచ్చింది అంటే అది ఈ’ అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ మాత్రమే అని చెప్పొచ్చు. దర్శకుడు దుష్యంత్‌ ఒక చిన్న సంఘటన ఆధారంగా రాసుకున్న కథ వెండితెర మీద అంతే సహజంగా చూపించడంలో సఫలం అయ్యాడు. ఈ సినిమాతో పరిశ్రమకి ఇంకో కొత్త యువ దర్శకుడు పరిచయం అయ్యాడు అనే చెప్పాలి.

సమాజంలో అధికులం, డబ్బు, పరపతి, అహంకారంతో విర్రవీగే ఊరి పెద్దమనిషిగా చెలామణి అయ్యే అతనిని బయపడి బతుకుతున్న ఆ ఊరి ప్రజలు, ఓపిక నశించిపోయి ఎదురుతిరిగే కొంతమంది యువకులు, ఇలాంటి కథలు ఎన్నో గ్రామాల్లో జరిగాయి. విన్నాం కూడా. ఈ ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ కథ కూడా అటువంటిదే, కొత్తదేమీ కాదు, కానీ దర్శకుడు ఈ కథని చాలా సహజంగా కొత్తగా చూపించాడు.

ఇది ఒక ప్రేమ కథ అనుకుంటే పొరపాటే, ఒక యువతి తన ఆత్మభిమానం కోసం పోరాటం చేసే కథ. దర్శకుడు ప్రతీ సన్నివేశాన్నీ ఎక్కడ నాన్చకుండా చాలా చక్కగా సహజంగా చూపించాడు. ముఖ్యంగా రెండో సగంలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రేక్షకుల హృదయాల్ని కట్టి పడేస్తాయి. ఇక ఈ సినిమాకి సంగీతం ఇచ్చిన శేఖర్‌ చంద్ర చాలా అద్భుతమైన నేపధ్య సంగీతం సమకూర్చాడు అనే చెప్పాలి.

కొన్ని సన్నివేశాలకి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారంటే దానికి ఒక ప్రధాన కారణం శేఖర్‌ చంద్ర ఇచ్చిన సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపధ్య సంగీతం రెండూ బాగుంటాయి. అలాగే ఛాయాగ్రహణం ఈ సినిమా కథకి అనుగుణంగా ఉంటుంది, ఆ వూరు, ప్రజలు, సన్నివేశాలు సహజంగా కనపడటానికి ఛాయాగ్రహణం ఎంతో ఉపయోగపడింది. పద్మకి రాసిన మాటలు హత్తుకుంటాయి, ఆలోచింపచేస్తాయి.

గ్రామీణ వాతావరణంలో వచ్చిన సినిమాలు వున్నా, ఒక మహిళా పాత్రని ఇంత బలంగా చూపించడం ఈమధ్య కాలంలో ఈ సినిమాలోనే చూపించాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి, ఒకరికొకరు చంపుకోవటం కాదు పరిష్కారం, మనం చంపితే హంతకుడు అంటారు అనే మాటతో బాగా చూపించాడు. ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ సినిమా ఎంతో సహజ సిద్ధంగా, ఎక్కడో ఇలా జరిగే ఉంటుంది అని అనుకునే సంఘటనలతో రాసిన కథ.

దర్శకుడు దుష్యంత్‌ కి పూర్తి మార్కులు, అలాగే నటీనటులు అందరూ ఎంతో సహజంగా నటిస్తూ, ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేట్టు చేశారు. ముఖ్యంగా శరణ్య పాత్రకి ఈలలు చెప్పట్లు, సుహాస్‌ మరో అద్భుతమైన పాత్ర పోషించాడు. మన చుట్టుపక్కల జరిగే సంఘటనలతో మన తెలుగు కథని, భావోద్వేగమైన సన్నివేశాలతో ఎలా ప్రేక్షకుల మెప్పు పొందాలో చూపించిన సినిమా ఇది.