అంతా అత్యున్నత న్యాయస్థానం మీదే ఆధారపడి ఉంది

Everything depends on the Supreme Court being yours
సాధారణ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అధికారాలు తిరుగులేనివి.  ఎన్నికలకు సంబంధించి వారి ఆదేశాలు  అనుల్లంఘనీయం.  వారికి రాజ్యాంగం సంపూర్ణ రక్షణతో కూడిన విస్తృతాధికారాలు ఉన్నాయి.  ఎన్నికలు నిర్వహించడంలో వారి అధికారానికి తిరుగు లేదు.  ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘానికి సహకరించి తీరాల్సిందే.  లేకపోతే ఎంత పెద్ద అధికారి మీదైనా ఎన్నికలసంఘం క్రమశిక్షణాచర్యలు తీసుకోవచ్చు.  
 
Everything depends on the Supreme Court being yours
Everything depends on the Supreme Court being yours
కానీ, ఇక్కడ ఎన్నికల కమీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగత అనైతికవర్తనతో ఎన్నికల కమీషన్ మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి.  ముఖ్యంగా ఆయన మాజీ తెలుగుదేశం నాయకులైన తన సామాజికవర్గీయులతో రహస్య సమావేశాలు పొరుగురాష్ట్రంలో జరపడం ఆయన నైతికతను ప్రశ్నార్ధకం చేసింది.  వారిని తాను ఎందుకు కలవాల్సివచ్చిందో, ఏమి చర్చించారో ఇంతవరకు ఆయన వివరణ ఇవ్వలేదు.   అది తన ప్రయివేట్ వ్యవహారం అని ఆయన చెప్పుకోవచ్చు.  ఆయన రాజ్యాంగ సంస్థకు అధిపతిగా ఉన్నారు.  కాకపొతే తాత్కాలికంగా తొలగించబడ్డారు.  మళ్ళీ తన పదవిని పొందడం కోసం రాష్ట్రప్రభుత్వం మీద కోర్టులు కేసు వేసి ఉన్నారు.  ప్రభుత్వ వ్యతిరేకులైన ముగ్గురు రాజకీయ నాయకులతో ఆయన రహస్యంగా చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది?  
 
 
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీరు తప్పా ఒప్పా అనేది మనం చెప్పలేము.  ఎందుకంటే కోవిద్ భయాన్ని వెలిబుచ్చుతూ వారి వాదనలు వారు వినిపిస్తున్నారు.  హైకోర్టులో ఒకసారి ప్రభుత్వం వాదన నెగ్గింది.  రెండోసారి ఎన్నికల సంఘం వాదన నెగ్గింది.  దానిమీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది.  సుప్రీంకోర్టు దాన్ని సోమవారానికి వాయిదా వేసింది.  బహుశా దాన్ని నమ్ముకునే రెండు రోజులు ఆగమని ప్రభుత్వం ఎన్నికల కమీషన్ను కోరుతున్నది.  ఎన్నికల కమీషనర్ ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించి ఉన్నట్లయితే ఎన్నికల కమీషన్ విలువ పెరిగేది.  నిమ్మగడ్డకు ఎలాగూ మార్చ్ నెలాఖరు వరకూ పదవీకాలం ఉన్నది.  అలాంటపుడు రెండు రోజులు వేచి ఉన్నతంతమాత్రాన ఆయనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.  ఒకవేళ సుప్రీమ్ కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఆయనకు తిరుగే ఉండదు.   డీజీపీని, చీఫ్ సెక్రెటరీని కూడా క్షణాల్లో బదిలీ చెయ్యొచ్చు.  తనకు కావలసిన అధికారులను నియమించుకోవచ్చు.  మరి ఎందుకు తొందరపడి నిన్ననే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు?   కొందరు మేధావులు ప్రభుత్వాన్ని మాత్రమే తప్పు పడుతున్నారు.  అదే సమయంలో నిమ్మగడ్డ ప్రవర్తన లోని లోపాలను గూర్చి మాట్లాడటం లేదు.  ఎవరి అభిప్రాయం వారిది.  కానీ, చంద్రబాబు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ నడుస్తున్నాడన్న భావన ప్రజలలో కలిగింది.  
 
నిమ్మగడ్డ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు ఎవ్వరూ ఆయన నిర్వహించిన వీడియో సమావేశానికి హాజరు కాలేదు.   అధికారులతో సమన్వయము చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాల్సిన ఆయన ఉన్నతాధికారులను, చివరకు  చీఫ్ సెక్రెటరీ, డిజిపి స్థాయి అధికారులను కూడా బెదిరించడం, హెచ్చరించడం, ఉద్యోగులను భయపెట్టడం లాంటి భూస్వామ్య చేష్టలతో తన విలువను తగ్గించుకున్నారు.  కర్రపెత్తనం చేసి కార్యాలు సాధించటం అంత తేలిక కాదు.  అవతలివాడు భయపడుతున్నంతకాలమే మన బెదిరింపులు పనిచేస్తాయి.   ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదు కాబట్టి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వెయ్యలేము.  
 
ఇలాంటి కీలకమైన పరిస్థితుల్లో హఠాత్తుగా నిమ్మగడ్డ ప్రయివేట్ వాహనంలో రహస్యంగా హైదరాబాద్ కు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.  పైగా రేపు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు.  బహుశా ప్రతిరోజూ ఆయన చేసే పితూరీలను వినడానికి గవర్నర్ ఇష్టపడలేదు కాబోలు..ఆయనకు అనుమతి లభించలేదు.  విజయవాడలోనే ఉండి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లినట్లు?  తనను ఆ పదవిలో నియమించిన గవర్నర్ అనుమతికోసం ఎదురుచూడకుండా హైదరాబాద్ వెళ్లిపోవడం అంటే గవర్నర్ ను కూడా ధిక్కరించడం కాదా? 
 
సుప్రీమ్ కోర్టులో ఏమి తేలుతుందో, ఎవరిని తప్పు పడుతుందో,  ఎలా ఈ చిక్కుముడిని విప్పుతుందో చూడాలి.   ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఇక పేచీయే లేదు.  వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆ తీర్పును ఇష్టం ఉన్నా లేకపోయినా అమలు చెయ్యాల్సిందే.  ఉద్యోగసంఘాలు, అధికారుల వాదనలు ఏమాత్రం చెల్లవు.  ప్రతి ఒక్కరూ ఎన్నికల కమీషన్ నియంత్రణలో పనిచేసి తీరాల్సిందే.  ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం మన రాజ్యాంగం కొన్ని వ్యవస్థలకు ఇచ్చిన రక్షణలు, తిరుగులేని అధికారాలు కొంతమంది నైతికవిలువలు లోపించిన  అధికారుల కారణంగా దుర్వినియోగం అవుతుంటాయి.   రంభ చేతికి నపుంసకుడు దొరికినట్లు వ్యక్తుల దుష్ప్రవర్తన కారణంగా వ్యవస్థలకు అపకీర్తి అంటుకుంటుంది.    మనం ఏమీ చేయలేము.  అదే దురదృష్టకరం.   శాసనవ్యవస్థ, అధికారవ్యవస్థ, న్యాయవ్యవస్థకు మినహా మిగిలిన అన్ని రాజ్యాంగవ్యవస్థలకు రక్షణకవచాలను తొలగించాలి.  ఆ వ్యవస్థలలో రాజకీయజోక్యాన్ని, రాజకీయ నియామకాలను నివారించాలి.   రిటైర్ అయినవారిని కాకుండా సర్వీసులో ఉన్న నిజాయితీపరులైన అధికారులను ఈ పదవులలో నియమించాలి.  చీడపురుగు చేరి చెట్టు చెరచు అన్నట్లు అవినీతిపరులు, అనైతికవర్తనులు రాజకీయఅవినీతిపరులకు తాబేదార్లు కీలకపదవుల్లో దూరిపోయి వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తారు.     
  
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు