ఎర్రగొండపాలెం నియోజకవర్గం మేడపి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే,మన ముఖ్యమంత్రి ముందే సంక్రాంతి వచ్చిందంటూ అనడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతింట చావుడప్పు మోగుతుంటే…ఏం పండగ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు? అని ఆయన ప్రశ్నించారు. గౌరవ ప్రదమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రికి రైతుల బాధలు,కష్టాలు,చావులు కనిపించకపోవడటం రాష్ట్రం చేసుకున్న పాపమన్నారు. రాష్ట్రంలో వర్ష బీభత్సం వలన మొత్తం 50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రూ.10 వేల కోట్లు నష్టం వస్తే రూ.646 కోట్లు విదిల్చి పండగ వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహారం అంచనా కూడా అవసరం లేదన్న జగన్రెడ్డి ఇప్పుడు ఎకరానికి రూ.5వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరుస్తున్నారు.ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ కట్టామని అసెంబ్లీలో అబద్ధాలాడారని విమర్శించారు. చంద్రబాబు అసెంబ్లీలో బైటాయించిన తరువాత ఇన్స్యూరెన్స్ కట్టారని తెలిపారు. తడిసిన దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలన్నారు.పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు, దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు, చేతి వృత్తుల వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం దొంగ ప్రకటనలు, అసత్య వార్తలు ఇస్తారా అంటూ రైతులతో కలిసి సాక్షి పేపర్ తీరుని ఎండగడుతూ కాల్చివేశారు.