ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. చంద్రబాబు చెంచా అంటూ తీవ్ర స్థాయిలో నిమ్మగడ్డపై మండిపడ్డారు నాని. అలాంటి మంత్రి కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ మరీ ముఖ్యంగా నిమ్మగడ్డపై పల్లెత్తు మాట అనడంలేదు. అసలేంటి కారణం… నిమ్మగడ్డపై కొడాలి సైలెన్స్ కి ఏదైనా బలమైన కారణం ఉందా ? అని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.
జగన్ ప్రభుత్వ కార్యాచరణకు భిన్నంగా పంచాయితీ ఎన్నికలు జరిపించాల్సిందేనని పట్టుపట్టి చివరకు అనుకున్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాధించారు. ఓ దశలో సీఎం జగన్ ఆయన వల్ల చాలా చికాకు పడ్డారు. ముఖ్యమంత్రిపై ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకోని కొడాలి నాని కూడా నిమ్మగడ్డను టార్గెట్ చేశారు. పదే పదే ఆయన పేరుతోపాటు చంద్రబాబు పేరుని కూడా ప్రస్తావిస్తూ ఇద్దరినీ ఒకే గాటన కట్టేసేవారు. ఒక్క నిమ్మగడ్డనే కాదు, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, ప్రత్యేకంగా దేవినేని ఉమ.. ఇలా వీరందరికీ కొడాలి చాకిరేవు పెట్టారంటే ఆ మాటలు వినలేం. ఆ స్థాయిలో ఉంటాయి ఆయన తిట్ల దండకాలు.
అయితే పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, నోటిఫికేషన్ రావడం, కోడ్ అమలులోకి రావడంతో ఎందుకో కొడాలి మౌనాన్ని ఆశ్రయించారు. నిమ్మగడ్డ కాదు కదా.. ఇంకెవరిపై కూడా ఆయన నోరు చేసుకోవడంలేదు. ఇటీవల కాలంలో కొడాలి నాని ఇలాకాలో జరిగిన పేకాట పంచాయితీ అందరికీ తెలిసిందే. అది జరిగిన సమయంలో సీఎం జగన్ మంత్రి కొడాలిని పిలిచి క్లాస్ తీసుకున్నారని, ఆయన వివరణ తీసుకోడానికి క్యాంప్ కార్యాలయానికి పిలిపించారని కూడా టీడీపీ అనుకూల మీడియా వార్తలిచ్చింది. అయితే అప్పటికప్పుడు వాటిని కొట్టిపారేశారు మంత్రి కొడాలి నాని.
కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి గురించి మాత్రమే జగన్ తో మాట్లాడి వచ్చానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంటి వద్దకే రేషన్ సరకులు చేర్చేందుకు ప్రవేశ పెట్టిన మొబైల్ వాహనాల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ తో కలసి పాల్గొన్నారు నాని. ఆ తర్వాత ఆయన పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అంతకు ముందులాగా నిమ్మగడ్డపై చెణుకులు విసరడంలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు.. నిమ్మగడ్డను మాటలతో టార్గెట్ చేస్తే.. అప్పటి వరకూ ఆయన్ని మాటలతో చెడుగుడు ఆడుకున్న కొడాలి నాని మాత్రం వెనకడుగు వేశారు. నాని మౌనానికి కారణం ఏంటని వైసీపీ వర్గాల్లోనే చర్చ మొదలైంది.