ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ చాణిక్యుడు, అపర మేధావి, అత్యంత అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రాజకీయ పద్ధతులు ఇప్పుడు పార్టీని కుంటుపడేలా చేస్తున్నాయి. నేతల్లో పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధినేత చంద్రబాబు నాయుడు అసలు ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అర్ధమేకాక పార్టీ క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ,బీజేపీ పార్టీలని ఎదుర్కొనే విధంగా వ్యూహాలు అమలుచేయాల్సి ఉంది. కానీ చంద్రబాబునాయుడు వేస్తున్న అడుగులు కారణంగా పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా తెలుగు యువత పదవి విషయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట వింటున్నారు అని అంటున్నారు. అచ్చెన్నాయుడు ఎవరికి చెప్తే వారికి ఆ పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారని సమాచారం. విశాఖ జిల్లాకు చెందిన ఒక యువనేతకు ఆ పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ కి ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనే భావన వ్యక్తం చేశారట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి బాలకృష్ణ కూడా పెద్ద యెత్తున సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ పదవిని ఆయనకు అప్పగిస్తే బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ నుండి మొత్తం సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారట. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో ఎలాంటి అడుగు కూడా వేయలేక పోతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు పార్టీని ముందుకు నడిపించాలంటే సమర్థవంతమైన నేతల అవసరం అనేది ఉంటుంది. అయితే అచ్చెన్నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఈ పదవి విషయంలో తీవ్రంగా బలవంతం చేస్తున్నారని ఆయన కూడా కాదనలేక పదవిని ఆయనకు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.