మూడు రాజధానుల ఆంధ్ర ప్రదేశ్ పయనమెటు?

దురదృష్టం కొద్దీ చారిత్రకంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏకత్వంలో భిన్నత్వంగా మూడు ప్రాంతాలుగా విభజింప బడ్డారు. చిర కాలంగా పాలకులు చేసిన తప్పిదంతో ప్రాంతీయ అసమానతలకు కొదవ లేదు. రాయలసీమ ఎడారిని తలపిస్తుంది. వర్షపాతం తక్కువ. ఉత్తరాంధ్ర తుఫానులకు నిలయం. వరదలు వచ్చినా సముద్రం పాలౌతోంది. కాని సాగుకు నీటి లభ్యత లేదు. ఇతర రాష్ట్రాల్లో నిర్మాణంలో వున్న భవంతులు కూలి పోతే మృతి చెందే వారు సీమ ఉత్తరాంధ్ర వలస కూలీలుగా వుంటారు. రాజకీయ పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి అవసరమైనంత ఇంధనం పుష్కలంగా వుంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ అంశంలో అధికార పక్షానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలకు తీవ్రమైన వైరుధ్యముంది. పరిపాలన వికేంద్రీకృత చేస్తే అభివృద్ధి కూడా వికేంద్రీకృతమౌతుందని అధికార పక్షం వాదిస్తోంది. పరిపాలన వికేంద్రీకృతం చేయకుండానే అభివృద్ధి వికేంద్రీకృతం చేయ వచ్చని మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాభి వృద్ధి దెబ్బ తింటుందని అన్ని ప్రతి పక్షాలు వాదిస్తున్నాయి.

అయితే ఇంతవరకు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోనే రాజధానుల అంశం నలుగుతుండగా తాజాగా అయాచితంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ముగ్గులోనికి తీసుకు రాబడ్ఢారు.మూడు రాజధానుల ప్రతిపాదనతో ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాల ప్రజలు ఎంత వరకు అభివృద్ధి చెందుతారో పక్కన పెడితే ఇంతకు ముందే వున్న ప్రాంతీయ ద్వేషాలు మరింత కార్చిచ్చులాగా తయారైనవి. తుదకు రాయలసీమలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ క్రమేణా బల పడుతోంది. కోస్తా వారి వలన మోసపోయామని ఇంత వరకు భావిస్తుండిన సీమలో ఈ వివాదం మరింత అగ్గి రగలేసింది.

2014 లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో నెలకొని వుండిన చారిత్రక నేపథ్యం గల శ్రీ బాగ్ ఒడంబడిక సెంట్ మెంట్ ను చంద్రబాబు నాయుడు పరిగణన లోనికి తీసుకొని హైకోర్టు సీమ ప్రాంతంలో నెలకొల్పి తను ఊహించి నట్లు ఎంతటి అద్భుత మైన అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి వున్నా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రాజధానుల ప్రతి పాదన తెర మీదకు తెచ్చి వుండే వారు కాదేమో. ఆలాంటి అవకాశం లభించి వుండేది కాదు. అంతేకాదు 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికగా బహిర్గతం చేసి వున్నా రాష్ట్రంలో ఈ అనిశ్చిత పరిస్థితి ఏర్పడేది కాదు.

ఏది ఏమైతేనేం మహిళల రోదనలు పోలీసు లాఠీ ఛార్జీ రక్త సిక్త గాయాలతో రాజధాని ప్రాంత ప్రజల పరుగులు ఉరుకులు మధ్య శాసన సభ మూడు రాజధానుల ప్రతిపాదనకు చెందిన బిల్లులను ఆమోదించింది. మంగళవారం సాయంత్రానికి హైడ్రామా మధ్య శాసన మండలి శాసన సభ ఆమోదించిన బిల్లులను పరిగణనలోకి తీసుకొంది. ఎందుకంటే శాసన మండలిలో తెలుగు దేశం పార్టీకి మెజారిటీ వున్నందున రూలు 71 కింద టిడిపి నోటీసు ఇచ్చి తొలి దశలోనే సభలో బిల్లులను అడ్డుకోవాలని చూచినా తుదకు ఛైర్మన్ అనుమతించడంతో సభలో బిల్లులు ప్రవేశ పెట్టబడ్డాయి. మున్ముందు టిడిపి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని గాని లేక తిరస్కరించే విధానం ఏదైనా చేపట్ట వచ్చు. ఏది ఏమైనా ఈ దశలో మూడు రాజధానుల ప్రతిపాదన అమలుకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే దీని పరిణామాలు మాత్రం తీవ్రంగా వుంటాయి.

మూడు రాజధానుల ప్రతిపాదనలో రాయలసీమ కు హైకోర్టు ఇవ్వ బడింది. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానులు తప్ప ఇప్పటి వరకు శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని ఉద్యమాలు చేసిన వారిలో ఎక్కువ మంది హైకోర్టుతో తృప్తి పడేట్టులేదు. పరిపాలనలో కూడా సమాన భాగస్వామ్యం కావాలనే డిమాండ్ విన్పిస్తున్నారు. మరి కొన్ని వర్గాలు రాజధాని ఇస్తారా? లేక ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా? అనే వాదనలు విన్పించు తున్నాయి.

ఇక కోస్తా ప్రాంతంలో కృష్ణ గుంటూరు జిల్లాలోని వైసిపి నాయకులు ఎంత గుంభనంగా వున్నా లోలోన ఎదురీద వలసి వుంటుందని మథన పడుతున్నారు. ఇందుకు మంగళ గిరి ఎమ్మెల్యే శాసన సభలో చేసిన ప్రసంగం ఈ ప్రాంత వైసిపి నాయకుల మనో భావాలను దర్పణం పడుతోంది. ఈ ప్రభావం ఈ రెండు జిల్లాల్లోనే కాకుండా చుట్టువున్న మరికొన్ని జిల్లాల్లో తీవ్రంగా వుంటుంది. విశాఖ రాజధాని దూరం అనే అంశంపై మంత్రులు ఇస్తున్న వివరణ ఆచరణలో ఏ మాత్రం ఉపయోగ పడదు. ప్రస్తుతం కేవలం ప్రత్యర్థుల నోళ్లు మూయించడానికి పనికి వస్తుంది. తమ ప్రాంతం నుండి రాజధాని తరలింప బడిందనే భావన సగటు మనిషిలో వుండి తీరు తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలు ముంగిట పెట్టుకొని ఇంత సాహసానికి ఏలా ఎందుకు తలపడ్డారో భవిష్యత్తు తేల్చవలసినదే.

అయితే మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో తీసుకు వచ్చే మార్పులు బట్టి ప్రజల అసంతృప్తిని నివారించ గలదు.ఇదిలా వుండగా రాయలసీమకు హైకోర్టు తరలింపుకు న్యాయపరమైన చిక్కులు వున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అయితే ఈ పాటికే రాష్ట్ర బిజెపి రాయలసీమకు హైకోర్టు నినాదం ఇచ్చివున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ గండం గడచి గట్టెక్క గలదు.ఇందులో మరో ట్విస్ట్ వుంది. పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తువలన రాజధాని మార్పు అంశంలో కేంద్రం నుండి కొంత ఇబ్బంది వుంటుందేమో. బిజెపి నేత నరసింహారావు రాజధాని అంశంలో కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేదని చెబుతుండగా ఢిల్లీ వెళుతున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో వుంచేందుకు బిజెపి మద్దతు ఇచ్చే ప్రాతిపదికననే తమ పొత్తు వుంటుందని ప్రకటించారు. ఈ సమయంలో ఈ పరిణామం కీలక మైనదిగా వుంది. మూడు రాజధానుల అంశంలో తెలుగు దేశం వ్యతిరేకత కన్నా మున్ముందు బిజెపి పవన్ కళ్యాణ్ నుండి ఎక్కువ వుంటుందేమో.

ఇవన్నీ రాజకీయ పార్టీలు మూడు రాజధానుల ప్రతిపాదనకు చెందిన అంశాలైతే చంద్రబాబు నాయుడు హయాంలో పడిన ప్రాంతీయ ద్వేషాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై వెల్లు వెత్తన పరస్పర ఆరోపణలు తుదకు దూషణల దశకు చేరింది. ఏకత్వంలో భిన్నత్వం కలిగిన తెలుగు ప్రజలకు ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదు. ఇంతకు మునుపు ఒక దఫా రాష్ట్రం రెండు ముక్కలైంది. భవిష్యత్తులో ఆలాంటి ప్రమాదానికి బీజాలు పడటమే ఆందోళన కరమైన అంశం

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
.