Pregnancy: గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లు తినవచ్చా? తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

వేసవికాలంలో మనకు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో మామిడికాయలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మామిడికాయలు మనకు వేసవికాలం మాత్రమే లభిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. మామిడి పండ్లను పండ్లలో రారాజుగా కూడా పిలుస్తారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీంతో ప్రతీ ఒక్కరూ మామిడిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేవలం రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యం పరంగా కూడా మామిడిలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ఇందులోని విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే గర్భిణీలకు మామిడి మంచిది కాదని, వేడి చేస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. మరి ఇంతకీ గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లు తినవచ్చో, తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడిపండ్ల లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరడచంతో పాటు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గర్భిణీలు మామిడి పండ్లను తీసుకోవాలి. కడుపులో బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా మారడంలో విటమిన్‌ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మామిడిలోని విటమిన్‌ ఏ సైతం కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి గర్భిణీలు ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండ్లను తీసుకోవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. మామిడి పండ్లను మోతాదుకు మించి తీసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కొందరిలో విరేచనాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాగా మామిడి పండ్లను అతిగా తీసుకోవడం వల్ల గర్భిణీల్లో అధిక బరువు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అధిక బరువుతో ఉన్నవారు, డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న గర్భిణీలు మామిడి పండ్లను తీసుకోకపోవడమే ఉత్తమం.