కరెంట్ పై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే! ఇదీ నిజం!

(శ్రవణ్ బాబు)

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం అంటూ సాధిస్తే అది కేవలం రెండు కారణాల వలనే అని చెప్పుకోవాలి. అది ఒకటి – బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్న తాయిలాలు. రెండు – నిరంతర విద్యుత్ సరఫరా. అందుకే కేసీఆర్ ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ ఈ రెండింటి గురించి ఊదరగొడుతుంటారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా గురించి అయితే ఆయన మాటలకు అడ్డూ ఆపు ఉండదు.

విభజన జరిగితే తెలంగాణ అంధకార బంధురమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, దానిని తన ప్రతిభతో తారుమారు చేసి రాష్ట్రంలో పవర్ కట్స్ లేకుండా చేశానని కేసీఆర్ అంటుంటారు. తెలంగాణలో మాత్రమే ఈ ఘనత సాధ్యమైందని, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పవర్ కట్స్ ఉన్నాయని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా చీకటి రాజ్యమేలుతోందని చెబుతుంటారు. నిరంతర విద్యుత్ సరఫరా వెనక తన నిరంతర కృషి ఉందని, నిద్రాహారాలు మాని గంట గంటకూ విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షిస్తుండటం వలనే ఇది సాధ్యమయిందని అంటూ కేసీఆర్ చెప్పుకొస్తారు. అయితే, ఈ మాటలన్నీ నూటికి నూరు పాళ్ళూ శుద్ధ అబద్ధం. అది ఎలాగో చూడండి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసేనాటికి రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి దారుణంగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా రోజులు విపరీతమైన పవర్ కట్స్ విధించారు. హైదరాబాద్ నగరంలో ఆరుగంటలు విధిస్తే, జిల్లాలలో 8నుంచి 12 గంటలపాటు పవర్ కట్స్ ఉండేవి. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అనేకచోట్ల రైతులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల యజమానులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేశారు. విభజన తర్వాత మిగులు బడ్జెట్ ఏర్పడటంతో తెలంగాణకు నిధుల కొరత లేదు. బయటనుంచి విద్యుత్ కొనుగోలు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఎక్కడనుంచైనా, ఎంత రేటుకైనా కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ రంగంలో మిగులులో ఉన్న ఛత్తీస్ గడ్ ప్రభుత్వంతో విద్యుత్ సరఫరాకై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒక విచిత్ర సమస్య నెలకొంది. డబ్బులున్నా తినలేని పరిస్థితిలాగా, విద్యుత్ కొనుగోలు చేద్దామని అనుకున్నప్పటికీ దానిని తీసుకోవటానికి ట్రాన్స్ మిషన్ లైన్స్ లేవు. కొత్త లైన్స్ నిర్మాణానికి అప్పుడు మొదలుపెట్టినా మూడేళ్ళ సమయం పడుతుందని అంచనాల్లో తేలింది. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఆరునెలలపాటు కొనసాగింది.   

2014 నవంబర్ నుంచి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది. వర్షాలు లేకపోవటంతో రైతుల విద్యుత్ అవసరాలు తగ్గటంవలన డిమాండ్ తగ్గింది. మరోవైపు, దేశవ్యాప్తంగా మారిన విద్యుత్ రంగ పరిస్థితి కేసీఆర్ కు కలిసొచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో విద్యుత్ శాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి పియూష్ గోయెల్ అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ పరిస్థితి ఒక్కసారిగా టర్న్ ఎరౌండ్ అయింది. గతంలో విద్యుత్ సప్లై తక్కువగానూ, డిమాండ్ ఎక్కువగానూ ఉంటుండగా, 2015 చివరినాటికి ఆ పరిస్థితి తారుమారై యూనిట్ విద్యుత్ ధర ఓపెన్ మార్కెట్ లో రు.2.35కు పడిపోయింది. 2014లో కూడా ఈ ధర రు.10 – 15 మధ్య ఉండేది. ఎన్టీపీసీ వంటి ప్రభుత్వరంగ విద్యుత్ ప్లాంట్లలో ఎవరూ కొనుగోలు చేయకపోవటంతో 11,000 మెగావాట్ల విద్యుత్ వృథాగా పడిఉండే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ ఎక్స్ ఛేంజిలలో రేట్లు విపరీతంగా పడిపోయాయి(https://energy.economictimes.indiatimes.com/news/power/dark-future-ahead-11000-mw-thermal-power-capacity-lying-idle-largest-outage-is-in-the-north/50556138).

కేసీఆర్ కు కలిసొచ్చిన మరో విషయం ఏమిటంటే 2015 మార్చి నాటికి ఒక ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభమవటం. ఏపీ కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ వారి 700 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ మార్చిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ప్రభుత్వం వారినుంచి కొనుగోలు చేసిన విద్యుత్ తో తెలంగాణలో పరిస్థితి మెరుగుపడింది. మరోవైపు వారికే చెందిన 500 మెగావాట్ల మరో ప్లాంట్ అదే సంవత్సరం జూన్ నుంచి ప్రారంభమవటంతో ఇక పవర్ కట్స్ నిలిపేశారు. అయితే ఈ విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ ప్రైవేట్ సంస్థలనుంచి అత్యధిక ధరకు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమల యజమానులు విద్యుత్తును ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయటం మానేసి చౌకగా వస్తున్న ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకోవటం ప్రారంభించారు. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చింది. పరిశ్రమలనుంచి డిమాండ్ తగ్గిపోయింది. ఈలోపు ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ లైన్ల నిర్మాణంకూడా పూర్తికావటంతో ఒప్పందం ప్రకారం అక్కడనుంచి కూడా విద్యుత్ రావటం ప్రారంభించింది. దీనితో ఒకనాడు విద్యుత్ రంగంలో తీవ్ర కొరతతో బాధపడ్డ తెలంగాణ ఇప్పుడు మిగులులోకి వచ్చింది. ఇదే కాదు దేశవ్యాప్తంగా ఏపీతో సహా పలు రాష్ట్రాలు మిగులులోనే ఉన్నాయి.

అలా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మారిన పరిస్థితులు తెలంగాణకు కలిసివచ్చాయి. మాటల మాంత్రికుడైన కేసీఆర్ దానిని విజయవంతంగా తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ తప్పితే దేశమంతా అంధకార బంధురంలో ఉన్నదన్నట్లు జనాన్ని నమ్మిస్తున్నారు. మరి కాంగ్రెస్ వారు కూడా దీనిని ఎందుకనో తిప్పికొట్టకపోవటంతో ప్రజలు దీనిని కేసీఆర్ ఘనతగానే భావిస్తున్నారు.

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)