జూన్ 2 నుంచి తెలంగాణలో నిరుద్యోగ భృతి అమలు

 తెలంగాణ రాష్ట్రావతరణ దినం అంటే జూన్ 2 వ తేదీనుంచి  రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయని ప్రభుత్వ వర్గాలు  ‘తెలుగు రాజ్యం‘ కు చెప్పాయి. నెలకు రు. 1500 కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం కచ్చితంగా కనబడుతూ ఉందని, రాష్ట్రంలో దాదాపు పది లక్షలమంది ఈ భృతి అందనుందని  ఈ వర్గాలు చెప్పాయి.

ఎంత మొత్తం ఇవ్వాలి, అసల నిరుద్యోగి నిర్వచనం ఏమిటి, వయో పరిమితి ఏమిటి , కుటుంబాదాయం ఎంత ఉండాలి, ఎంత కాలం ఇవ్వాలి అనే విషయాలను ప్రభుత్వం  ఇపుడు పరి శీలిస్తున్నది. వీటి అధ్యయనం పూర్తవగానే నిరుద్యోగ భృతి మొత్తం ఎంత ఉండాలనేదాని మీద స్పష్టత వస్తుంది.  ఈ అంచనాను బట్టి వచ్చే బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు వుంటుందని కూడా ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.ఈ స్పష్టత కోసమే తెలంగాణ అవతరణ దినం నాటి నుంచి అమలయ్యేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని ఈ వర్గాలు తెలిపాయి.

 ఈ  లోపు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో సహా ఇతర రాష్ట్రాలలలో నిరుద్యోగ భృతి పథకాలను అధ్యయనం చేయడం మొలు పెట్టింది. ఇపుడు ఏడు రాష్ట్రాలలో నిరుద్యోగ భృతి పథకాలు అమలులో ఉన్నాయి. అవి, ఆంధ్రప్రదేశ్. ఛత్తీష్ గడ్, కేరళ, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు. ఇక్కడెక్కడా ఈ పథకం ఒకే రూపంలో లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఉదాహరణకు  ఛత్తీష్ గడ్ 18-35 సంవత్సరాల మధ్య  ఉన్న నిరుద్యోగులకు రు. 1000 ల నిరుద్యోగ భృతి ఇస్తున్నది. ఆంధ్రలో కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కాకపోతేఅర్హత వయసు 22-35 సం.రాలు. ఆంధ్రలో గత అక్టోబర్ 2  నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. హర్యానాలో ఈ పథకం మరొక విధంగా ఉంది. అక్కడ చదువు,వయసును బట్టి నిరుద్యోగ  భృతి  మారిపోతుంది. అంతేకాదు, మహిళా గ్రాజయేట్లకు పురుషులకంటే ఎక్కువ. వయసు 21-35 సంవత్సరాలు.  టెన్త్ పాసయిన యువకులు నిరుద్యోగ భృతి నెలసరి రు.100, ఇంటర్ అర్హత ఉన్నవారికి రు. 900, గ్రాజ్యుయేట్లకు రు. 1000 నుచి1500, పోస్టు గ్రాడ్యుయేట్లకు రు.3000 ఇస్తున్నారు.చిన్న రాష్ట్రమయిన హర్యానాలో ఇది సాధ్యం. అయినా సరే ఈ విధానం కూాడా పరిశీలనలో ఉంది. ’హిమాచల్ ప్రదేశ్ లో రెండు స్లాబులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇంటర్ పాసయి, 20 సంవత్సరాలు వయసున్న వారందరికి నెలకు 1000 చొప్పున రెండేళ్ల పాటు భృతి ఉంటుంది. 50 శాతంలోపం ఉన్న పిహెచ్ సి లకు రు. 1500 భృతి ఉంది. ఇది 20-35 సంవత్సరాల మధ్య ఉన్నవారికి మాత్రమే భృతి ఇస్తారు,’ అని ప్రభత్వ వర్గాలు చెప్పాయి. తెలంగాణలో హిమాచల్ నమూనా అనుసరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ఈ వర్గాలు చెప్పాయి.

అందువల్ల తెలంగాణలో నిరుద్యోగి అంటే ఎవరు, వయోపరిమితితో పాటు, కుటుంబ పెద్ద ఆదాయం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని భృతి నిర్ణయిస్తారు. ఈ విధానం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి పూర్తి చేసి, జూన్ 2 వ తేదీ నుంచి అమలు చేసేందుకు కృషి జరుగుతుందని  ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.