షాకింగ్ న్యూస్ : టిఆర్ఎస్ కు మరో ఇద్దరు ఎంపీల గుడ్ బై?

టిఆర్ఎస్ ను వీడేందుకు మరో ఇద్దరు ఎంపీలు రంగం సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ గురించి పలు సంచలన విషయాలను వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు త్వరలోనే టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారని తెలిపారు.

టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సొంత వ్యాపార సంస్థలా పని చేస్తుందన్నారు. టిఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదన్నారు. టిఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం లేదని పార్టీలో ఇమడలేకనే కాంగ్రెస్ లో చేరానన్నారు.

టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావుతో పాటు, పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి కూడా కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. వారు కూడా త్వరలో పార్టీకి రాజీనామా చేస్తారు. నేను రాజీనామా చేసిన తర్వాత ఎంపీ వినోద్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావన్నారని కొండా తెలిపారు. 

టిఆర్ ఎస్ పార్టీ గురించి కొండా పలు సంచలన విషయాలు చెప్పారు. అవి ఆయన మాటల్లోనే 

“తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోంది. మంత్రులకు తమ మంత్రిత్వ శాఖల్లో జరిగే బదిలీల గురించి ఏం తెలియదు. తెల్లారి పేపర్లల్ల వచ్చే వార్తలు చూసి వారు తెలుసుకుంటారు. ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు కూడా అందులో ఏముందో తెలియదు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డికి పోలీస్ బదిలీల గురించి తెలియదు, నియామకాల గురించి తెలియదు. అంతా కేసీఆర్ , కేటిఆర్ కను సైగల్లోనే జరగుతది.

టిఆర్ఎస్ పార్టీలోని నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైనా సరే కేసీఆర్, కేటిఆర్ లకు జీ హూజూర్ అనాల్సిందే. లేకపోతే వాళ్ల పదవులకు గ్యారంటీ ఉండదు. అంగట్లో గుర్రాలను, గాడిదలను కొన్నట్టుగా కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. పార్టీలో ప్రజా ప్రతినిధులు అంటే గౌరవమే లేదు. ఇటీవల కాంగ్రెస్ నుంచి చేరిన నేతలకు 6 కోట్ల రూపాయలు ఎరగా వేసి పార్టీలో చేర్చుకున్నారు. వారి నుంచి మరికొంత మందిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని జితేందర్ రెడ్డి తనతో అంటే తనకు ముందు అర్ధం కాలేదు కానీ తర్వాతి కాలంలో అర్ధమైంది. 

టిఆర్ఎస్ పాలనలో రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ అభివృద్ది కుంటుపడింది. రంగారెడ్డి జిల్లాలో పర్యటించని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. నేను నా నియోజకవర్గం చేవేళ్లలో కూడా పర్యటించని పరిస్థితి తీసుకొచ్చారు. నేను నియోజక వర్గం పర్యటన చేస్తే మంత్రి మహేందర్ రెడ్డి కేటిఆర్ కు చెప్పేవారు. కేటిఆర్ వెంటనే ఫోన్ చేసి నీకు నియోజకవర్గంలో ఏం పని..  వెళ్లి సప్పుడు చేయకుండా కూర్చో అంటూ బెదిరించేవారు. కేటిఆర్ నన్ను అనేక రకాలుగా వేధించాడు.

పట్నం మహేందర్ రెడ్డి బ్రదర్స్ కు కబ్జా బ్రదర్స్ అనే పేరు ఉంది. వారి కంట్లో భూమి పడితే కథమే. నియోజకవర్గంలో అనేక మందిని వేధించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు. తెలంగాణ పై 2.20 లక్షల కోట్లు అప్పులు మోపాడు. అప్పుడే పుట్టిన బిడ్డ పై కూడా రూ. 61 వేల అప్పు మోపారు. వెయ్యి పింఛన్లు, రైతులకు ఎకరాకు 4 వేలు ఇస్తే ఏం ప్రయోజనం. కేసీఆర్ నియంతల పరిపాలిస్తున్నాడు. 

టిఆర్ఎస్ కు అన్ని వర్గాల ప్రజలు దూరమయ్యారు. ముస్లింలు బిజెపితో దోస్తీ ఒప్పకోరు. కేసీఆర్ బిజెపితో పొత్తు పెట్టుకునే వ్యూహంలో ఉన్నారు. కవితను కేంద్రమంత్రి చేసేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్ పాలన అంతా కూడా పనికిమాలిన పాలన “ అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.