‘నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా’… బీఆరెస్స్ పై కీలక చర్చ!

భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, మరెన్నో కేంద్ర పాలిత ప్రాంతాలూ ఉన్నాయి. అయితే.. వీటిలో ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటాలు చేశారు.. మరికొంతమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. ఈ పోరాటాల్లో దాదాపు యావత్ తెలంగాణ ప్రజానికం పాల్గొంది, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసింది. ఈ క్రమంలో… నాటి మలి విడత పోరాటంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించిన పార్టీ… ప్రస్తుత బీఆరెస్స్, అప్పటి టీఆరెస్స్ అని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతారు!

ఆ బీఆరెస్స్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, ఆయా ప్రాంతాల పార్టీల కార్యాలయాల్లో సంబరాలుఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు ఎగరవేసి బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టి సంబురాలు జరుపుకున్నారు. ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్‌’ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసినవారికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు… తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో బీఆరెస్స్ పురుడుపోసుకున్నదని.. 25 ఏండ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిందని.. కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నదని.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్లు పాలించి అద్భుతాలు సృష్టించిందని అన్నారు. ఈ సందర్భంగా… కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇందులో భాగంగా… “ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాల పునాదుల మీద సాధించిన తెలంగాణ, కాంగ్రెస్ కబంధహస్తాల్లో విధ్వంసం అవుతున్న వేళ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన.. మరో ప్రతినబూనుదాం. తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కోట్లాడుదాం.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనమంతా పునరంకితం అవుదాం..” అని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వరుస పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు… ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా.. ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుతున్న పార్టీ బీఆరెస్స్ అని.. పాపపు పాలనలో ప్రజలు నలిగిపోతున్న వేళ.. ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒకటే నినాదమని.. అదే “రేవంత్‌ పోవాలి.. కేసీఆర్‌ రావాలి” అని హరీష్ రావు అన్నారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు!

చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహం ఎఫెక్ట్..!:

పెంచిన కరెంట్‌ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పొట్టనబెట్టుకోవడంతో.. ఆ విషయం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు.. ఈ ఆటవిక చర్యతో కలతచెందిన కేసీఆర్… తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు షురూ చేశారు. ఈ క్రమంలోనే… 2001 ఏప్రిల్‌ 17న కరీంనగర్‌ ‘సింహగర్జన’ సభ వేదికగా స్వరాష్ట్రం కోసం రణగర్జన చేశారు. 2001 ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌ లోని జలదృశ్యంలో టీఆరెస్స్ పార్టీని ప్రకటించారు.

ఆ సమయంలో… “నిన్న పడిన చినుకులకు నేడు మొలిచిన మొక్క ఆ పార్టీ”.. అది నిలబడేది కాదు అనే కామెంట్లూ వినిపించాయి. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు.. అనేక ఆటుపోట్లు! అయినప్పటికీ వెనక్కి తగ్గని తెలంగాణ ప్రజల మద్దతుతో కేసీఆర్ ముందుకు కదిలారు. నాలుగుకోట్ల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే సమయంలో.. రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు.

ఈ క్రమంలోనే… 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకొని “ప్రత్యేక తెలంగాణ” అంశాన్ని యూపీఏ ఎన్నికల ప్రణాళికలో చేర్పించారు. ఫలితంగా… 2009 డిసెంబర్‌ 9న యూపీఏ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఓ పక్క రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. ఈ అడ్డంకులన్నింటినీ చేధించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ క్రమంలో.. రెండు దఫాలు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బీఆరెస్స్ పాలించింది.

ఈ నేపథ్యంలో… 2023లో బీఆరెస్స్ అధికారం కోల్పోయింది. దీంతో.. ఆ పార్టీ పనీపోయిందనే కామెంట్లు వినిపించాయి. అయితే… ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ప్రభావమో.. లేక, బీఆరెస్స్ కార్యకర్తల కసో తెలియదు కానీ… ప్రజల్లో తన ఆధరణను కాపాడుకుంటూ ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో సిల్వర్ జూబ్లీ సంబరాల్లో ఉంది!