ఎండమావి – జలపాతం… మధ్యలో ఆ ముగ్గురు..!

ఒక్కోసారి ఆలోచిస్తే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు అద్భుతంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని అనిపిస్తుంటుంది.. మరోసారి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. తిరోగమనంవైపు పరుగెడుతున్నామా అనే ఆందోళన కనిపిస్తుంటుంది.

అందుకుగల కారణాల్లో ఒకటి… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న నాయకులు, వీలైతే రాబోయే నాయకులూ ఉన్నంతలో యంగ్ అండ్ డైనమిక్స్ కావడం.

కానీ.. జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అధికారం శాస్వతం అనే భ్రమల్లో బ్రతుకుతున్నారా.. వారి వ్యక్తిగత కోరికల మేరకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా.. తద్వారా తర్వాత అధికారంలోకి నేతలకు అన్ని రకాల అనుమతులు అనధికారికంగా ఇచ్చేస్తున్నారా.. బొమ్మ కాస్తా బొరుసైతే తర్వాతి పరిణామాలు తట్టుకోగలమని భావిస్తున్నారా అనే ప్రశ్నలు స్పురిస్తుంటుంది.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ తనదైన పాలనతో దూసుకువెళ్తున్నారని అంటున్నారు. మంచిదే! మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ఉన్నప్పటికీ… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ రూపంలో ఫ్యూచర్ పాలిటిక్స్ మరింత యంగ్ అండ్ ఎనర్జిటిక్, అప్ డేటెడ్ వెర్షన్ పరిపాలన చూడొచ్చనే చర్చా జరుగుతుంది.

అమెరికాలో చదివి, అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేసి, తెలంగాణ ఉద్యమ సమయంలో భారత్ కు వచ్చారనే కాదు కానీ… తెలంగాణ స్థానిక పరిస్థితులు, రూరల్ ప్రజల స్థితితగులతో పాటు పట్టణ, నగర ప్రజల ఆలోచనా విధానం, అభివృద్ధిపై కేటీఆర్ కు సంపూర్ణమైన అవగాహన ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఆయన వాక్ చాతుర్యం కూడా కలిసొచ్చే అంశం!

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ… అనధికారిక ప్రభుత్వ పెద్దగా లోకేష్ ఉన్నారనే చర్చ ఆఫ్ ది రికార్డ్ వినిపిస్తున్న పరిస్థితి. దీనికితోడు ఆయనను తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించింది తెలుగుదేశం.

సో… రాబోయే కాలానికి టీడీపీ తరుపున కాబోయే మహారాజు, ఈ యువరాజు నారా లోకేష్ అన్నమాట. కాకపోతే.. పట్టాభిషేకం ఆయన చేతల్లో, తద్వారా ప్రజల చేతుల్లో ఉంటుంది!

నారా లోకేష్ కూడా అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి వచ్చిన వ్యక్తి. గ్రామీణ ప్రాంత పరిస్థితులపై అవగాహన సంగతి కాసేపు పక్కనపెడితే… తాను భవిష్యత్తులో ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా మారే సత్తా ఉన్న వ్యక్తినని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ తొలిప్రయత్నంలో సక్సెస్ అయిపోరు కాబట్టి.. కొన్ని వైఫల్యాలు ఎదురైనా.. చంద్రబాబు కుమారుడిగా హస్తినలో మంచి వెల్ కం లభిస్తుంది.. మంచి లాబీయింగ్ చేయగలరని చెబుతున్నారు.

ఇక… నారా లోకేష్ తండ్రితో ఢీ అంటే ఢీ అంటున్న ఆయన సమకాలికుడి కుమారుడు వైఎస్ జగన్ కూడా ఫుల్ యంగ్ అండ్ అనర్జిటిక్ అనే సంగతి తెలిసిందే. 2019లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. సుమారు రెండేళ్లు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన మహమ్మారి ఎదురైనప్పటికీ.. తనదైన పాలనతో మంచి మార్కులే సంపాదించుకున్నారు.

తన తండ్రి తరహాలోనే పేదలు, మధ్యతరగతి ప్రజల వైపు ఎక్కువగా ఆలోచిస్తారని.. మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడతారనే పేరు అతి తక్కువ కాలంలోనే సంపాదించుకున్నారు. తనను తాను విజనరీ అని చెప్పుకోరు కానీ.. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, మొదలైన ఆలోచనల్లో విజన్ ఉన్న నాయకుడిగా నిరూపించుకున్నారు. కాకపోతే ప్రచారం సరిపోలేదని అంటారు!

అధికారం అంటారా..? అది అందడానికి, దూరమవ్వడానికి కేవలం అధినేత మాత్రమే కారణం కాదు కదా..! అది రావాలన్నా, పోవాలన్నా కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జగన్ మళ్లీ సీఎం అయితే.. కచ్చితంగా ఏపీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని మాత్రం మెజారిటీ ప్రజానికం నమ్ముతున్నారని అంటారు. ఎందుకంటే… 2024 ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ, కూటమిలోని చంద్రబాబు, మోడీ, పవన్ కల్యాణ్ లనూ కాదని సుమారు 40% ఓటింగ్ వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

అందువల్ల… రేపు తెలంగాణలో కేటీఆర్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చినా.. ఏపీలో నారా లోకేష్ లేదా వైఎస్ జగన్.. సీఎం లుగా పాలించే ఛాన్స్ ప్రజలు ఇచ్చినా.. పాలనపైనా, ప్రజలపైనా, రాష్ట్రాభివృద్ధిపైనా, రేపటి తరం భవిష్యత్తుపైనా దృష్టి పెడితే.. వీరి తెలివితేటలకు, అప్ డేటెడ్ ఆలోచనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.. తెలుగు ప్రజల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.

అయితే… గత కొంతకాలంగా, ప్రధానంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం ప్రభుత్వానికంటే ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ లకు చెడ్డపేరు తీసుకొస్తుందనే చర్చ జరుగుతుంది. అందుకు ప్రధాన కారణం.. చంద్రబాబు మెత్తబడిపోయారని, నామమాత్రపు అధినేతగా మరిపోయినట్లున్నారని అంటున్నారు పరిశీలకులు.

అందుకు కారణం… ఏపీలో లోకేష్ నాయకత్వంలో అని చెబుతున్న అరెస్టులు, ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలపై తీసుకుంటున్న ఖాకీ చర్యలు అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి మాజీ మంత్రుల వరకూ ఎవరు అరెస్టైనా.. అది సక్రమమా, అక్రమమా అనే సంగతి పక్కనపెట్టి.. అందరి వేళ్లు లోకేష్ వైపే చూపిస్తున్నాయి.. రెడ్ బుక్ ప్రస్థావనను తీసుకొస్తున్నాయి.

ఈ వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే వైసీపీ ఓ బుక్ ప్రింట్ చేసి, హస్తిన వేదికగా జాతీయ స్థాయిలో రోడ్లపై పెట్టిన పరిస్థితి. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ రెడ్ బుక్ గ్రంధకర్త తీరు మారలేదని చెబుతున్నారు. పైగా అది రాష్ట్రం మేలు కోసమే, సమాజ హితం కోసమే అన్నట్లుగా లోకేష్ వ్యాఖ్యానించడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

తప్పు చేసిన వారిని అరెస్టు చేయొద్దని ఎవరూ చెప్పరు.. కానీ, దానికి ఓ పద్దతి, పాడు ఉంటుంది కదా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎవరైనా పెద్ద నేతను అరెస్టు చేస్తున్నారంటే.. అల్లర్లు జరగకుండా అర్ధరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లారంటే.. సెక్యూరిటీ రీజన్స్ అని సర్ధుకోవచ్చు, సమర్థించొచ్చు.

కానీ.. చిన్న చితకా కార్యకర్తలను, సోషల్ మీడియా జనాలను సైతం అర్ధరాత్రులు గోడలు దూకి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటో లోకేష్ కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది.

పైగా ఈ తరహా సంస్కృతి కొనసాగితే.. అది మరింత వికృత పరిస్థితులకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు ఇదంతా అంతా సమాజ హితం కోసమే అని లోకేష్ & కో సమర్ధించుకుంటున్నారు. సరే… మరి రేపు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే..? ఈ ప్రశ్నకు… “తమ్ముళ్ల పరిస్థితి వారి ఊహకే వదిలేయొచ్చు” అనేది గతానుభవాలు కలిగిన పలువురి సమాధానంగా ఉంది! “ మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇళ్లు అంతే దూరం కదా” అనేది మరికొందరి ఆన్సర్!

ఏది ఏమైనా… ముగ్గురు యంగ్ నాయకులతో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై ప్రజలకు, ప్రధానంగా యువతకు ఎన్నో ఆశలు ఉన్నాయి.. వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందనే కోరికలు కనిపిస్తున్నాయి. మరి వాటిని ఎండమావులుగా మారుస్తారో.. లేక, జలపాతాలను సృష్టిస్తారో ఈ ముగ్గురి చేతుల్లోనే ఉంది.. వారి చేతల్లోనే ఉంది!