ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టిఆర్ఎస్ లో రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఓ వైపు హరీష్ రావు, కేటిఆర్ లు ఎత్తుగడలు వేస్తుంటే వారి ఎత్తుగడలను తలదన్నేలా స్వంత పార్టీ నేతలే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని పైసలున్నోళ్లకే టిఆర్ఎస్ లో గుర్తింపు ఉందంటూ పలు విషయాలను వారు వెల్లడించారు. తాజాగా పలువురు కీలక నేతల రాజీనామా నుంచి తేరుకోక ముందే రంగారెడ్డి జిల్లాలో కీలక నేత రాజీనామా చేసి టిఆర్ఎస్ కు షాకిచ్చారు.
టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు చిరుమామిళ్ల మధు టిఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. కేసీఆర్ కు రాజీనామా లేఖ రాసిన మధు ఏమన్నారంటే..
“2001 నుంచి టిఆర్ఎస్ లో పని చేశాను. ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. లాఠీ దెబ్బలు తిన్నాను. జైలు కెళ్లాను. అయినా కూడా టిఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు లేదు. అనేక సార్లు, కేసీఆర్ కేటిఆర్ లను కలిసినా కూడా ప్రయోజనం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వారి ముఖం కూడా చూడలేక పోయాను. ఓ ఉద్యమ కారుడిగా సిగ్గు పడుతున్నాను. ఇటువంటి వాళ్ల కిందనా నేను పని చేసిందని. అందరికి ఉద్యోగాలు అని చెప్పి వారి కుటుంబంలో ఐదు పదవులిచ్చుకున్నారు. ఉద్యమకారులు పోరాటాలకు తప్ప రాజకీయాలకు పనికిరారా అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాను. చాలా మంది ఉద్యమకారులు ఒక్క రోజు పూర్తిగా భోజనం చేయలేని పరిస్థితిలో బతుకుతున్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం దోచుకొని బాగుపడుతుంది.
మలి దశ తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతా చారి కుటుంబానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోంది. అరాచక పాలన సాగుతోంది. చాలా మంది టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారు. పైసలున్నోళ్లకు ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన వారిని అవమానిస్తున్నారు. త్వరలోనే టిఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు వచ్చి పార్టీ కూలి పోవడం ఖాయం. మరికొంత మంది ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీని వీడబోతున్నారు. నాకు స్పష్టమైన సమాచారం ఉంది.” అంటూ చిరుమామిళ్ల మధు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాదాన్యత లేదన్న కారణంగానే ఆయన పార్టీని వీడారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన గత కొంతకాలంగా ఆవేదనతో ఉన్నారు.

తన తాత రాజకీయాల్లో చేసిన సేవలకు గుర్తుగా తన తాత కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఏర్పాటైన విషయాన్ని ఆయన తన సహచరుల వద్ద గుర్తు చేసుకున్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన తమకు టిఆర్ఎస్ లో ఏమాత్రం గౌరవం దక్కలేదని మదనపడ్డారు. తన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కలేదు కాబట్టే టిఆర్ఎస్ కు రాజీనామా చేశానన్నారు.
విశ్వేశ్వర్ రెడ్డి తర్వాత వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో చాలా కాలం నుంచి వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఐడిసి చైర్మన్ బుడాన్ బేగ్ టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన నిర్ణయంతో ఖమ్మం జిల్లా కార్యకర్తల్లో కలకలం రేగింది. బుడాన్ బేగ్ గత కొంత కాలంగా పార్టీ తీరు పై అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఆయన ఆశించినట్టుగా కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. దీని పై చర్చించేందుకు కేటిఆర్ అపాయిట్ మెంట్ కోరినా ఇవ్వలేదని తెలిసింది. రెండేళ్లుగా కేసీఆర్ అపాయిట్ మెంట్ ఇవ్వలేదని, కేటిఆర్ ను సంవత్సరం నుంచి అపాయిట్ మెంట్ కోరినా కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ , కేటిఆర్ అత్యంత సన్నిహితుడు గొట్టిముక్కల పద్మారావు కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పద్మారావు అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. ఆయన కూకట్ పల్లి అసెంబ్లీ నుంచి సీటును ఆశించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీటు విషయమై కేటిఆర్ ను కలిసి విషయాన్ని చెప్పారని అయినా కూడా ఆయన నుంచి స్పందన లేదని పద్మారావు అనుచరులు తెలిపారు.

ఇలా వరుసగా కీలక నేతలు పార్టీని వీడడంతో కింది స్థాయిలో కార్యకర్తలతో కీలకంగా వ్యవహరించే నేతలు లేకపోవడంతో క్యాడర్ లో కలవరం మొదలైంది. టిఆర్ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ చేద్దామంటే ఆపరేషన్ వికర్ష్ అవుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. త్వరలోనే మరికొంత మంది టిఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడడం ఖాయమన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి తీసుకొని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని వారు గుర్తు చేశారు. కేసీఆర్ కు స్వంత పార్టీ నేతలే ఝలక్ ఇస్తుండడంతో ఏం చేయాలో తోయక తలపట్టుకుంటున్నారని వారు ఎద్దేవా చేశారు.
