పనిచేసే చోట రక్షణ ఉండాల్సిందే.. 35 చిన్నకథకాదు.. పెద్ద సందేశం అంటున్న నివేదా

నివేదా థామస్‌ , విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ’35 చిన్న కథ కాదు…’ నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. రానా నిర్మాత. తెలుగు, తమిళ్‌, మలయాళంలో సెప్టెంబర్‌ 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నివేదా విూడియాతో ముచ్చటించారు. ’35 చిన్న కథ కాదు’ చాలా సింపుల్‌ స్టోరీ. సరస్వతి పాత్రను పోషించాను. ఇలాంటి పాత్రలు చేయాలని నాకు మొదటి నుంచి ఆసక్తి. తెరపై విూరు నివేదాను చూడరు.. సరస్వతినే చూస్తారని నివేదా అన్నారు. ఇందులో విద్యావ్యవస్థ గురించి గొప్పగా చూపించారు.

అలాగే చిన్నచిన్న ఆనందాలను చూపించారు. కరెంట్‌ పోయినప్పుడు క్యాండిల్‌ పెట్టుకొని అన్నం తినడం.. ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సీన్స్‌ మలయాళం చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే మలయాళం సినిమాలు వేరే భాషలో డబ్బింగ్‌ చేయడం కొంచెం కష్టం. ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. వెంకటేశ్వరస్వామి కూడా ఓ పాత్రలా చూపించాం. ఒక కుటుంబంలో ఉండే చిన్నచిన్న అపార్థాలు ఎక్కడికి దారితీశాయి అనేది కథ. అమ్మ తన ప్రేమతో ఆ కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కె.విశ్వనాథ్‌ చిత్రం చూసినట్లు ఉంటుంది.

భార్యాభర్తల మధ్య బంధానికి అందరూ కనెక్ట్‌ అవుతారు. ’35’ అంటే మార్కులకు సంబంధించినదే ..అందరూ అదే అనుకుంటారు. కానీ, ఇది మార్కులతో పాటు పిల్లలకు సంబంధించినది. వాళ్లకు లెక్కల్లో వచ్చే మార్కుల చుట్టూ కథ తిరుగుతుంటుంది. పిల్లలు అడిగే కొన్ని ప్రశ్నలకు మనకు కూడా సమాధానం తెలియదు.

మన దేశంలో 20 ఏళ్లు దాటిన అమ్మాయిని అడిగే మొదటి ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌?’. అలాంటప్పుడు నేను 20 ఏళ్లు దాటాక తల్లి పాత్ర పోషిస్తే తప్పేముంది. దీని ప్రభావం నా తర్వాత సినిమాలపై పడుతుందని ఆలోచించాను కానీ.. ప్రేక్షకులకు నేను అన్నిరకాల పాత్రలు చేస్తానని తెలియాలి కదా. ఈ పాత్రకు నివేదా మాత్రమే న్యాయం చేయగలదు అని దర్శకులు అనుకుంటే అది ప్రశంసతో సమానం. ఒకే తరహా పాత్రలు చేయాలని నేను అనుకోను. ఇందులో మొత్తం 60 మంది పిల్లలు ఉన్నారు. వాళ్లందరూ హీరోలే. తిరుపతి యాస కోసం శిక్షణ తీసుకున్నా. నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ట్యూషన్‌ చెప్పారు.

చిన్నచిన్న పాయింట్లతో సహా అన్నీ నేర్పించారు. ప్రస్తుతం హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. నేను ’అమ్మ’లో ఓ సభ్యురాలిని. హేమ కమిటీ నివేదికలో వెలుగుచూసిన అంశాలు చాలా బాధాకరం. వాటి గురించి చాలా ఆలోచించాను. మా కుటుంబంతో కూడా చర్చించాను. అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలని ఎంతోమందితో చర్చించా. డబ్ల్యూసీసీని ఈ విషయంలో ప్రశంసించాలి. వాళ్ల చొరవ వల్లే ఇది సాధ్యమైంది. మహిళలకు పనిచేసే చోట భద్రత కల్పించడం కనీస అవసరం. దీని గురించి నేనూ రిక్వెస్ట్‌ చేశాను. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత సమయం ఉంటున్నామో దానికంటే ఎక్కువ సమయం పని ప్రదేశాల్లో గడుపుతాం. అలాంటిచోట భద్రత అనేది అత్యవసరం అని నివేదా అన్నారు.