‘కల్కి’పై ప్రేక్షకుల్లో అసహనం.. మహాభారత పాత్రల వక్రీకరణ!

సినిమాల్లో కొన్నిసార్లు లాజిక్‌ ఉండదు. లాజిక్‌ లేకుండా కథలు సాగుతాయి. అయితే పురాణాల నుంచి తీసుకున్న కథల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘కల్కి’ విషయంలోనూ ఇదే జరిగింది.ఈ సినిమా తీయడానికి తనకి భారతీయ పురాణాలు స్ఫూర్తి అని చెప్పారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పలు సందర్భాల్లో. ఈ సినిమా కథ మొదలవడం ద్వాపరయుగంలో మహాభారత సంగ్రామం అయిన తరువాత శ్రీకృష్ణుడు, అశ్వద్దామకి శాపం ఇస్తాడు.

అలాగే అశ్వద్దామ చేసిన పాపం పోవాలంటే కలియుగంలో కల్కిగా పుడతాను, అప్పుడు నువ్వు ఆ బిడ్డని కాపాడాలి అని కూడా చెప్తాడు కృష్ణుడు. ఇక కథ కలియుగంకి వస్తుంది. దీపికా పదుకోనే గర్భంలో పెరుగుతున్న బిడ్డ కల్కి అవతారమని అశ్వద్దామ (అమితాబ్‌ బచ్చన్‌) ఆ బిడ్డని కాపాడటానికి సర్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివర్లో విలన్స్‌ పైచేయిగా అనిపించినప్పుడు భైరవ పాత్రలో వున్న ప్రభాస్‌ని కర్ణుడిగా చూపించి, అశ్వద్దామకి సహాయం చెయ్యడానికి వస్తాడు. అదే సమయంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు కర్ణుడు ధాటికి తట్టుకోలేక అతని రథం కొంచెం వెనక్కి వెళుతుంది, ఎందుకంటే కర్ణుడి ప్రభావం తట్టుకోలేక అర్జునుడు వెనకడుగు వేసినట్టుగా చూపిస్తారు. ఈ సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకి మాత్రం ఇది మింగుడు పడటం లేదు. ఎందుకంటే కర్ణుడు, అశ్వద్దామ ఎక్కడ స్నేహం కలిపారు, ఏ భారతంలో చెప్పారు? అలాగే అర్జునుడిపై కర్ణుడిని గొప్ప వీరుడుగా చూపించాడు.

ఇది కూడా భారతంలో ఎక్కడ వుంది? మరి ఏ పురాణాలు నాగ్‌ అశ్విన్‌ చదివారు అని బయటకి వచ్చిన ప్రేక్షకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మహాభారతంలో కర్ణుడు గొప్ప వీరుడే, కానీ అర్జునుడి కన్నా కాదు. కర్ణుడు ఎంత గొప్ప దానాలు చేసినా, గొప్ప వీరుడైనా అధర్మంవైపు వుండి యుద్ధం చేశాడు. అలాగే అర్జునుడి చేతిలో కురుక్షేత్రం కన్నా ముందు చాలాసార్లు ఓడిపోయాడు. అనేక సందర్భాల్లో కర్ణుడిపై అర్జునుడిదే పైచేయి అవుతుందన్నది మహాహభారత కథ. కర్ణుడు ఓడిపోతూ ఉంటాడు, అంతేకానీ కర్ణుడు ఎప్పుడూ గెలవలేకపోయాడు. ఇక కర్ణుడికి గురువైన ద్రోణాచార్యుడుపై కూడా గురుభక్తి లేదు.

ఎన్నోసార్లు ద్రోణాచార్యుడుని అధిక్షేపించాడు కర్ణుడు, అశ్వద్దామకి కూడా అందుకే కర్ణుడు అంటే పడదు. కర్ణుడు మాటలు విని దుర్యోధనుడు పాడైపోతున్నాడు అని అశ్వద్దామ కూడా ఎన్నోసార్లు హెచ్చరించాడు. అందువలన అశ్వద్దామకి, కర్ణుడికి స్నేహం ఎక్కడా వున్నట్టుగా భారతంలో లేదు. అశ్వద్దామకి పాండవులపై కోపం ఎప్పుడు వచ్చిందంటే, తన తండ్రి ద్రోణాచార్యుడని అన్యాయంగా చంపారని అతను భావించాడు. దృష్టద్యుమ్నుడు కత్తితో ద్రోణాచార్యుడు తల నరుకుతాడు, అది చూసి అశ్వద్దామ పగ పెంచుకుంటాడు.

అయితే ఎక్కడా కూడా కర్ణుడికి, అశ్వద్దామకి స్నేహం ఉందని మాత్రం చెప్పలేదు. అలాగే అర్జునుడు కన్నా కర్ణుడు ఎందులోనూ సమానుడు కాదు. మరి నాగ్‌ అశ్విన్‌ ఎక్కడ పురాణాలూ చదివాడో అర్ధం కావటం లేదని ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. అర్జునుడిపై కర్ణుడిని ధీరోదాత్తముగా చూపించడం ప్రేక్షకులకి ఒక పట్టాన మింగుడు పడటం లేదు.