అరుణాచలం… అగ్ని లింగేశ్వరుడు !

కార్తీకమాసం పవిత్రమైన మాసం. శివకేశవ ఆరాధనకు అత్యంత అనుకూలమైన సమయం ఇది. ఈ సమయంలో శివకేశవ క్షేత్రాల గురించి చదివిన, తెలుసుకున్నా, దర్శించిన మహా విశేష ఫలితాలు లభిస్తాయి. ఈరోజు పవిత్రక్షేత్రం అరుణాచలం గురించి తెలుసుకుందాం…తమిళనాడులోని తిరువణ్ణామలై రకరకాలుగా ప్రసిధ్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనంటారు. సృష్టిలోని పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల ఆగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు. ఆలయ ఆవిర్భావం ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్ని స్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనంటారు. సృష్టిలోని పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల ఆగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.

ఆలయ ఆవిర్భావం

ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్ని స్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారిరువురికీ చెప్పిన కధ మీకు తెలుసుగదా. అది ఇక్కడే జరిగిందంటారు. తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అణ్ణామలై. శివుడికి వున్న అనేక నామాల్లో అణ్ణాల్ అనే పేరుకూడా ఒకటి. అణ్ణాల్ అంటే అగ్ని, ప్రకాశం వగైరా అర్ధాలున్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండూకలిసి అణ్ణాల్ మలై, కాలక్రమైణా అణ్ణామలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవసూచకం. సాక్షాత్తూ శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవచిహ్నం తిరు ముందు చేరి తిరువణ్ణామలైగా ప్రసిధ్ధిపొందింది.
శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరివల్లాకాదని, పర్వత పాదంలో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా, శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మిచవలసినదిగా బ్రహ్మ, విష్ణులు దేవ శిల్పి మయుణ్ణి కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్య తీర్ధాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం వున్న ఆలయం భక్తులను తరింపచేస్తోంది.

విశేషాలు

తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా, అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడి రాజుల, ముఖ్యంగా, అనేక ఆలయాల నిర్మాణానికి కారకులయిన చోళ రాజుల శ్రధ్ధా భక్తులే కావచ్చు. తిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.
ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు. ఇదే ప్రధాన ద్వారము. నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బృహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. 70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.

భరణీదీపోత్సవం కార్తీక మహాదీపం

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది . ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15) 10 రోజులపాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది.
ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్రలో వేయి కిలోల స్వఛ్ఛమైన నేతిని పోసి, 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి, ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది.

అరుణగిరి ప్రదక్షిణ

ఇక్కడ గిరి ప్రదక్షిణ విశేషం. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం. 14 కి.మీ.ల దూరం వుండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా వుంటుంది. దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిధ్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షివంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు. ఆది అణ్ణామలైలో శివలింగ ప్రతిష్ట బ్రహ్మదేవుడు చేశాడంటారు. ఇక్కడ అమ్మవారు అణ్ణములై అమ్మాళ్. ఇది కూడా పెద్ద ఆలయం.
ఏ నెలైనా పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రిగల పౌర్ణమిరోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరిప్రదక్షిణ మార్గంలో వాహనాలకి ప్రవేశంలేదు. అంత విశాలమైన మార్గంలోకూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్ళలేమంటే అతిశయోక్తికాదు. భక్తులు ఎంత భక్తి శ్రధ్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు. రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు. ఇప్పటికీ అనేకమంది సిధ్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. మార్గము ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 180 కి.మీ. ల దూరంలో వుంది.