కృష్ణా నదిలో ఒకేసారి వందల కొద్దీ పాములు కనిపించాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవిత్ర కార్తీక మాసంలో ఇలా జరగడం దైవలీల అని భక్తులు భావిస్తుండగా, ఇవి పాములు కావని, ఒక రకమైన చేపలని స్థానిక మత్స్యకారులు స్పష్టం చేశారు.
ఘటన పూర్వాపరాలివీ.. కృష్ణా జిల్లా నాగాయలంకలోని ప్రసిద్ధ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో, నవంబరు 19న శ్రీరామపాదక్షేత్రం పుష్కర ఘాట్ వద్ద ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. నదిలో వందల సంఖ్యలో పాములను పోలిన జీవులు గుంపులు గుంపులుగా ఈదుకుంటూ రావడాన్ని చూసి భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు వీటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. కార్తీక మాసంలో శివాలయం వద్ద ఇలా పాములు కనిపించడం మహిమేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అసలు నిజం ఏమిటంటే? నదిలో కనిపించినవి నిజమైన పాములు కావని, అవి ‘ఈల్’ (Eel) జాతికి చెందిన చేపలని స్థానిక మత్స్యకారులు వెల్లడించారు. వీటిని స్థానికంగా ‘పాము చేపలు’ అని కూడా పిలుస్తారు. ఇటీవల సముద్రంలో ఏర్పడిన తుపాను పరిస్థితుల కారణంగా, సముద్రం నుంచి ఈ చేపలు భారీగా కృష్ణా నదిలోకి కొట్టుకువచ్చాయని మత్స్యకారులు తెలిపారు.
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ‘జనసేన’.. ఇప్పటి నుంచే సిద్ధం కావాలి
Ongole Airport: ఒంగోలు వాసులకు శుభవార్త: 1,100 ఎకరాల్లో కొత్త ఎయిర్పోర్ట్.. వేగంగా డీపీఆర్ పనులు
ఇవి మనుషులకు ఏమాత్రం ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు. కేవలం నాగాయలంకలోనే కాకుండా అవనిగడ్డ, కోడూరు ప్రాంతాల్లోనూ మత్స్యకారుల వలలకు ఈ చేపలు చిక్కుతున్నాయి. ఇవి నీటిలోనే కాకుండా, అప్పుడప్పుడు నేలపైనా పాకుతూ కనిపిస్తాయని తెలిపారు. సాధారణంగా కృష్ణా నదిలో పాములను పోలిన రెండు రకాల చేపలు కనిపిస్తాయి.
ఇవి పాము తలని పోలిన ఆకారంతో, మంచినీటిలో నివసించే మాంసాహార చేపలు. స్నేక్ ఈల్స్ (Snake Eels) ప్రస్తుతం నాగాయలంకలో కనిపించినవి ఇవేనని భావిస్తున్నారు. వీటిని ‘బురోయింగ్ ఈల్స్’ అని కూడా అంటారు. ఇవి పొడవుగా, సన్నగా, స్థూపాకారంలో ఉండి అచ్చం పాముల్లాగే కనిపిస్తాయి.
మొత్తానికి, పాములుగా భావించి భయాందోళనకు, ఆశ్చర్యానికి గురైన ప్రజలకు.. ఇవి కేవలం చేపలే అని తెలియడంతో ఉత్కంఠ వీడింది.

