ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత నుండి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఏపీ సర్కార్ అసలు వద్దు అని చెప్పింది… చెప్తుంది. అయినా సరే ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం అనూహ్యంగా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇక్కడి నుంచి కూడా రాజకీయం హాట్ టాపిక్ అయింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సిఎస్ చెప్తేనే ఎన్నికల విధుల్లో పాల్గొంటామని అధికారులు అంటున్నారు.
తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. తన పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు భయపడే జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు కోవిడ్ వైరస్ ను బూచిగా చూపుతున్నారు అని ఆయన ఎద్దేవా చేసారు.పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా తగ్గుతుందన్న జగన్మోహన్ రెడ్డి, నేడు ఎన్నికలకు భయపడటం సిగ్గుచేటు అన్నారు. ఆ భయంతోనే జగన్ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది అని అన్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తోంది అని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలని టీడీపీ అభిలషిస్తోంది అని అన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీనే మెజారిటీ స్థానాలను కైవశం చేసుకుంటుందని స్పష్టంచేస్తున్నాను అని అన్నారు. ప్రజాతీర్పుని శిరసావహించడానికి ప్రభుత్వం కోర్టులకు వెళ్లడం బాధాకరం అని ఆయన ఎద్దేవా చేసారు.