ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారు. దీంతో.. ఏపీ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకువెళ్లబోతోంది అనే చర్చ జరిగింది. 2014 – 19 మాదిరిగా కాకుండా ఈ సారి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారమూ జరిగింది.
ఈ క్రమంలో… తాజాగా ఏపీకి పెట్రోల్, డీజిల్ కొరత అనే ఓ పెద్ద సమస్య వచ్చింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
* ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతకు కారకులు ఎవరు..?
* ఈ సమస్యకు ప్రధాన కారణం.. ప్రభుత్వ పెద్దల్లో కొరవడిన ముందుచూపా.. లేక, అధికారుల అలసత్వమా..?
* నాదెండ్ల మనోహర్ తన పౌర సరఫరాల శాఖపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నరా..?
* వైసీపీ అధినేత ఆరోపిస్తున్నట్లు.. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ చంద్రబాబు లాభపడే ఆలోచనే దీనికి అసలు కారణమా..?
* గోరంత సమస్యను కోండంతగా చేసి ప్రతిపక్షం ప్రజల్లో ఆందోళనలు సృష్తిస్తోందా..?
ఇన్ని ప్రశ్నల నడుమ… ఈ సమస్యకు అసలు కారణం ఏమిటి.. పరిష్కారం ఏమిటి.. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన సర్కులర్ ఏమిటి.. ఆ సర్కులర్ వెనుక ఉన్న కథాకమీషులేమిటి.. దాన్ని కేంద్రం ఎందుకు తప్పుబట్టింది.. ఇన్ని రోజులు ప్రజలు అనుభవించిన ఇబ్బందులకు, వారి నుంచి వినిపించిన హాహాకారాలకు కారకులు.. ఎవరు అనేది ఇప్పుడు చూద్దామ్…!!
ఏపీలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తోంది పెట్రోల్, డీజిల్ కొరత సమస్య. అయితే… ఈ సమస్య కు చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఓ కీలక సర్క్యులర్ కారణం అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా.. ఆ సర్క్యులర్ ను కేంద్రం తప్పుబట్టిందని తెలుస్తోంది. ఆ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపింది!
దీంతో.. ఒకటి రెండు రోజుల్లో సమస్య పూర్తిగా సమసిపోవచ్చని అంటున్నారు. ఈ సమయంలో.. అసలు విషయం తెలిసిన ప్రజానికం చంద్రబాబుపై మండిపడుతున్నారని తెలుస్తోంది!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఓ పక్క రాష్ట్రంలో ఇంధనం కావాల్సినంత వచ్చిందని, ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. ఇండెంట్లు, సరఫరా అయిన విషయాలు వెల్లడిస్తున్నారు! మరోవైపు.. బంకుల్లో చూస్తే పెట్రోల్, డీజిల్ లేదు!
ఈ గ్యాప్ లో ఏమి జరిగిందో తెలియక చాలామంది నాదెండ్ల మనోహర్ ని తప్పుబట్టిన పరిస్థితి! ఓ వర్గం మీడియా ఆ విధంగా ప్రొజెక్ట్ చేసిందనే చర్చా నడించింది!
మరోవైపు… రెండు మూడు రోజుల నుంచి ఈ సమస్య తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అని నిలదీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ పత్రికలు, ఛానల్స్ లో కథనాలు, స్పెషల్ స్టోరీలు కనిపించాయి!
కట్ చేస్తే… రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా ఎన్నో ఇబ్బందులను సృష్టించిన ఈ సమస్యకు అసలు కారణం చంద్రబాబు సకార్ చేసిన పని అని.. తనకున్న అపార అనుభవాన్ని ఉపయోగించి సీఎం చేసిన పని అని.. కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసం సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిన పని అని తేలిందనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది!
అసలేం జరిగింది..?
దాదాపు వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయి. తొలుత ఇది రాష్ట్రంలో ఉన్న మొత్తం బంకుల్లో సుమారు 10%కి బంకుల ముందు ఉండగా.. ఆదివారం నాటికి ఈ సమస్య తీవ్రమైంది. దీంతో దాదాపు సగం బంకుల్లో పరిస్థితి ఇలానే ఉందనే చర్చ జరిగింది. ఇక సోమ, మంగళవారం నాటికి సుమారు 70% బంకుల్లో ఇంధనం లేదనే విషయం వైరల్ గా మారింది.
దీంతో.. “ఇది కూటమి ప్రభుత్వం కాదు, క్యూలో నిలబెట్టే ప్రభుత్వం” అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా.. ఈ కూటమి ప్రభుత్వంలో.. యూరియా కోసం రైతులు.. పింఛన్ కోసం వృద్ధులు, వింతతువులు.. రేషన్ కోసం మహిళలు.. గ్యాస్ కోసం ప్రజలు క్యూల్లో నిల్చున్న సంఘటనలను ప్రజలు గుర్తు చేసుకున్నారని అంటున్నారు.
దీనికంతటికీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలే కారణం అని తాజాగా తేలడంతో వారి ఆగ్రహం తీవ్రస్థాయికి చేరిందని చెబుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే… వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్ డీజిల్ ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్ పెట్రోలు బంకులలో.. రాజధాని నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశించాలని చంద్రబాబు నిర్ణయించారు!
దీంతో… రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ ఏప్రిల్ 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్క్యులరే రాష్ట్రవ్యాప్తంగా ప్రజానికం పడిన, పడుతున్న ఇక్కట్లకు అసలు కారణం అయ్యింది!
అయితే… ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకపోవడంతో… రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. చమురు కంపెనీలపైనా, అధికారులపైనా తీవ్ర ఆగ్రహం.. అంటూ జరిగిన ప్రచారాన్ని చాలామంది ప్రజానికం నమ్మారని అంటున్నారు!
ఈ నేపథ్యంలో… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఢిల్లీలో పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలిశారు. ఏపీలో వారం రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు.
ఈ సమయంలో… సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ ను చంద్రబాబు సర్కారు ఏపీలో కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పిస్తూ.. వాణిజ్య అవసరాల కోసం దారి మళ్లించినట్లు బహిర్గతమైందని తెలుస్తోంది.
దీంతో… చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయటాన్ని కేంద్రం తప్పుబట్టింది! ఇది చట్ట విరుద్ధమని, దాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని ఆదేశించింది!
దీంతో… ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పూర్తిగా సమసిపోవచ్చని అంటున్నారు. అనంతరం… ఈ సర్క్యులర్ పై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రసవత్తర రాజకీయ ఘట్టానికి తెరలేవొచ్చని చెబుతున్నారు.
ఏది ఏమైనా… ఈ సమస్య మాత్రం వీలైనంత త్వరగా సమసిపోతే.. సామాన్యుడు కాస్త ఊపిరి తీసుకుంటాడు అనేది మాత్రం వాస్తవం. ఇక… ఈ సర్క్యులర్ ఎఫెక్ట్ ప్రభుత్వంపై ఏ మేరకు చూపిస్తుంది, ప్రజల్లో ఎంత ఆగ్రహాన్ని తెప్పిస్తుందనేది వేచి చూడాలి!
