ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి మూడో దఫా పరిపాలనపై ప్రజల అభిప్రాయాలకు ఈ ఎన్నికల ఫలితాలు లిట్మస్ టెస్ట్ లాంటివని అంటున్నారు పరిశీలకులు. ఈ ఫలితాలు కేంద్రంలోని అధికార బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై ఓ స్పష్టత తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పలు ప్రశ్నలు తెరపైకి వస్తోన్నాయి!
* తమిళనాడులో డీఎంకే స్టాలిన్ చేతిలో మరోసారి బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తప్పదా..?
* తమిళనాడులో ఫైట్ ని ట్రయాంగిల్ ఫైట్ గా మార్చిన విజయ్ విజిల్ ఎంత గట్టిగా వినిపించనుంది..?
* కేరళలో మరోసారి ఎర్ర జెండా రెపరెపలు కన్ ఫామేనా..?
* వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడు దఫాల పాలనపై ప్రజలకు మొహం మొత్తేసింది..?
* అస్సాం కాషాయానికి కంచుకోటగా ఫిక్సైపోవచ్చా.. హ్యాట్రిక్ కన్ ఫా చేసుకోవచ్చా..?
* పుదుచ్చెరిలో ఎన్డీయే కూటమి పాలన కంటిన్యూ అవుతుందా..?
ఇలాంటి ప్రశ్నలను తెరపైకి తెచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఏమేమి కీలక విషయాలు దాగి ఉన్నాయనేది ఇప్పుడు పరిశీలిద్దామ్…!
ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ లో జరిగిన తుది విడత పోలింగ్ తో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటింగ్ సందడి ముగియగా.. మే 4న ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెరపైకి వచ్చాయి.
తాజాగా విడుదలైన ఈ ఫలితాలే కౌంటింగ్ రోజు ఫలితాల్లోనూ కనిపిస్తే మాత్రం ఈ ఎన్నికలు ఖచ్చింతంగా దేశ సమకాలీన రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీయడం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు.
తమిళనాడు:
ఇందులో ముందుగా తమిళనాడు విషయానికొస్తే… తొలుత ఇక్కడ ప్రధాన పోటీ అధికార “డీఎంకే + కాంగ్రెస్”, ప్రతిపక్ష “అన్నాడీఎంకే + బీజేపీ ల మధ్యే ఉంటుందని అంతా భావించారు. అయితే… టీవీకే పార్టీతో స్టార్ సినీ నటుడు విజయ్ ఎంట్రీ ఇవ్వడంతో.. తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ మొదలైంది.
విజయ్ ప్రభావం ఈ ఎన్నికల్లో కచ్చితంగా కీలకంగా మారనుందనే చర్చా జరిగింది. తాజాగా ఆ చర్చకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి!
తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా… మ్యాజిక్ ఫిగర్ 118. ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు… అధికార డీఎంకే తమిళనాడులో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని సూచిస్తున్నాయి.
ఇందులో భాగంగా… డీఎంకే + కాంగ్రెస్ కూటమి 120 నుంచి 140 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా… అన్నాడీఎంకే + బీజేపీ కూటమి 60 నుంచి 70 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
ఇక ప్రధానంగా… విజయ్ టీవీకే పార్టీ 30 నుంచి 40 స్థానాల్లో మాత్రమే విజిల్ వేసే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. దీంతో… తమిళనాడు ప్రజల వద్ద బీజేపీ పాచిక పారలేదని తెలుస్తోంది!
పశ్చిమ బెంగాల్:
ఇక మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే.. ఇక్కడ ప్రధానంగా ఫైట్ అధికార తృణముల్ కాంగ్రెస్ కి ఎన్డీయే కూటమికి మధ్య జరిగిందని అంటున్నారు! ఇక్కడ పోటీని మమతా వర్సెస్ మోడీగా కూడా పరిశీలకులు చిత్రీకరించిన పరిస్థితి! ఈ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండటంతో.. ఇక్కడ ఎన్నికలు రెండు దఫాలుగా జరిగాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 148.
ఈ క్రమంలో ఈసారి పశ్చిమ బెంగాల్ లో కాషాయ కండువా రెపరెపలకు ఛాన్స్ విషయాన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా… వెస్ట్ బెంగాల్ లో ఈసారి బీజేపీ 150 నుంచి 175 స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండగా.. అధికార తృణముల్ కాంగ్రెస్ కూటమికి 118 నుంచి 138 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మరో ఏజెన్సీ మాత్రం ఈసారీ పశ్చిమ బెంగాల్ లో మమత విజయం ఖాయమని అంచనా వేసింది. ఇందులో భాగంగా… టీఎంసీ కూటమికి 195 నుంచి 205 స్థానాల్లో విజయం దక్కే అవకాశ్మ ఉండగా.. బీజేపీ 80 నుంచి 90 స్థానాలకు పరిమితమవ్వనుందని తెలిపింది! దీంతో… పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర చర్చ మొదలైంది.. సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
కేరళ:
ఇదే సమయంలో కమ్యునిస్టుల కంచుకోటగా ఉన్న కేరళ విషయానికొస్తే… ఇక్కడ అసెంబ్లీలో 140 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 71.
ఈ నేపథ్యంలో కేరళలో హ్యాట్రిక్ కొట్టాలనే పినరపి విజయన్ కోరికపై ఇంకా సస్పెన్స్ కొనసాగేలా ఉందని తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో… సీపీఐ (ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్.డీ.ఎఫ్.) కు 66 నుంచి 76 స్థానాలు దక్కే అవకాశం ఉండగా… కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూ.డీ.ఎఫ్.) 60 నుంచి 70 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి.
అంటే… ఎల్.డీ.ఎఫ్., యూ.డీ.ఎఫ్. మధ్య ఇక్కడ విజయం దోబూచులాడుతూ, టఫ్ ఫైట్ కి తెరలేపిందన్నమాట. ఇక్కడ బీజేపీ ప్రభావం 5 నుంచి 9 మధ్య మాత్రమే ఉండి, సింగిల్ డిజిట్ కి పరిమితమవ్వొచ్చని అంటున్నారు!
అస్సాం:
అదేవిధంగా హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ఎదురుచూస్తోన్న అస్సాం రాష్ట్రంలో 126 స్థానాలు ఉండగా… మ్యాజిక్ ఫిగర్ 64.
ఈ క్రమంలో తాజాగా వెలువడుతున్న పలు ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలించిన అనంతరం.. అస్సాంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలు కన్ ఫాం అని తెలుస్తోంది!
ఈ క్రమంలో… బీజేపీ కూటమికి 85 నుంచి 100 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉండగా… కాంగ్రెస్ కూటమికి 20 నుంచి 35 స్థానాల్లో మాత్రమే విజయం అని సూచిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. ఇక్కడ ‘ఇతరుల’ ప్రభావం దాదాపు శూన్యంగానే కనిపిస్తున్నాయి.
పుదుచ్చేరి:
ఇదే సమయంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలు ఉండగా… ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ మరోసారి సత్తా చాటాలని ఎన్డీయే కూటమి భావించింది.
ఈ క్రమంలో బీజేపీ కూటమికి 16 నుంచి 20 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ ప్లస్ కూటమి 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇదే సమయంలో టీవీకే ఇక్కడ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాన్ని ఎగ్జిట్ పోల్స్ వెళ్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా… ఇక్కడ టీవీకేకి 2 నుంచి 6 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి!
ఏది ఏమైనా తాజాగా సంచలనం సృష్టిస్తోన్న ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలే అసలు ఫలితాలతో నూటికి నూరు శాతం మ్యాచ్ అవుతాయని చెప్పలేం కానీ… గతంలో దాదాపు మ్యాచ్ అయిన సందర్భాలు, రివర్స్ అయిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అసలు ఫలితాలు వచ్చే వరకూ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలే హల్ చల్ చేయడం, ఈ మేరకు ఆయా పార్టీలు ముందస్తు సంబరాలు చేసుకోవడం మాత్రం కన్ ఫాం!
