Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం వివాహితపై అత్యాచారం

Visakha Express: రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన రైల్వే సిబ్బందే కామాంధుడిగా మారి దారుణానికి ఒడిగట్టాడు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వివాహితపై ఏసీ బోగీ అటెండెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఓ దంపతులు ఉపాధి కోసం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం వీరు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీ ఎక్కారు. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటంతో బాత్‌రూమ్ సమీపంలో కూర్చున్న ఆ దంపతులను చూసిన ఏసీ బోగీ బెడ్‌షీట్ బాయ్ శౌరవ్ బగ్ది (ఒడిశా వాసి), వారిని ఏసీ బోగీలోకి రమ్మని ఆహ్వానించాడు. అక్కడ ఖాళీ సీట్లు ఉన్నాయని నమ్మబలికాడు.

అతడి మాటలు నమ్మిన దంపతులు ఏసీ కోచ్‌లోకి వెళ్లారు. భర్త బాత్‌రూమ్ దగ్గరే ఉండిపోగా, భార్యను లోపలకు తీసుకెళ్లిన శౌరవ్.. కోచ్‌లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రైలులో గొడవ జరిగితే పరువు పోతుందన్న ఆందోళనతో బాధితురాలు ఆ సమయంలో మౌనంగా ఉండిపోయింది.

వెలుగులోకి తెచ్చిన భర్త గ్రామానికి చేరుకున్న తర్వాత భార్య ముభావంగా ఉండటాన్ని గమనించిన భర్త, ఆమెను గట్టిగా నిలదీయడంతో జరిగిన ఘోరాన్ని వివరించి కన్నీరుమున్నీరైంది. వెంటనే బాధితులు రెంటచింతల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఘటన తీవ్రత దృష్ట్యా రెంటచింతల పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రైల్వే పోలీసులు వేగంగా స్పందించి నిందితుడు శౌరవ్ బగ్దిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న ఈ ఘటనపై రైల్వే శాఖ మరియు పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Bharadwaja About Vizag Data Center | Google to invest USD 15 Billion in AP | Telugu Rajyam