AP Weather: ఏపీ ప్రజలకు అప్రమత్తత: అటు వడగాల్పులు.. ఇటు వడగళ్ల వానలు!

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం భిన్నంగా మారింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా, మరికొన్ని చోట్ల వరుణుడు పలకరిస్తున్నాడు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

నెల్లూరులో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత: బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగింది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఒకటిగా నిలిచింది. గురువారం కూడా ఇదే తరహా ఎండలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

30 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక: గురువారం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరో 20 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు ఊరటనిస్తున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వర్షం కురిసే సమయంలో రైతులు, పశువుల కాపరులు పొలాల్లో ఉండవద్దని, ముఖ్యంగా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగుతూ ఉండాలని హెచ్చరించారు.

Vijay Thalapathy Creates A New Record? | Pawan kalyan | Telugu Rajyam