జగన్ సత్తాకు చంద్రబాబు మరో పరీక్ష… ఎవరి ధమ్ము ఎంత?

ఆరు నూరైనా నూరు ఆరైనా రాబోయే మూడేళ్లలో తాను అనుకున్న లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని చంద్రబాబు బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే లోకేష్ ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన చంద్రబాబు… పోలవరం, అమరావతి నిర్మాణంపై 2014 – 19 మధ్య ఇచ్చిన స్టేట్ మెంట్స్ ని మించి ఇస్తున్నారు. ప్రజల్లో ఆశలు కలిగిస్తున్నారు.

గతంలో అసెంబ్లీలో నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ.. “2019లోపు పోలవరం పూర్తవుతుంది.. రాసుకో జగన్” అన్న స్థాయిని మించి ఇప్పుడు భరోసా మాటలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

అలా పార్టీలో కీలక బాధ్యతలు వారసుడికి అప్పగించడం, తద్వారా శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో పాటు అమరావతి, పోలవరాలపై తనదైన ప్రకటనలు చేసిన చంద్రబాబు… ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపైనా గట్టిగానే ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎట్టిపరిస్థితుల్లోనూ సుమారు 33 సంవత్సరాలపాటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని బలంగా ఫిక్సైనట్లు కనిపిస్తున్నారు.

ఈ విషయంలో ప్రజలు ఎంత వ్యతిరేకించినా.. కోటి కాదు, రెండు కోట్ల సంతకాలు పెట్టినా తాను మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు కదులుతున్నారు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినను అన్నట్లుగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.

వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అదే నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తనదైన వెర్షన్ వినిపించారు.

ఇందులో భాగంగా… రాష్ట్రాన్ని ఒక విజన్‌ తో పరిపాలిస్తున్నామని.. ప్రజలకు వైద్యసేవలు, అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి తేవడంలోనైనా, వైద్య విద్యలో సీట్ల కేటాయింపులోనైనా తమ ప్రభుత్వానిదెప్పుడూ పేదల పక్షమే అని చెబుతూ… వైద్యం విషయంలో పేదలకు మెరుగైన సేవలందించడానికి పీపీపీ సరైనమార్గమని తేల్చి చెప్పారు.

అంటే… ప్రజలకు మెరుగైన సేవలు, మెరుగైన పాలన అందించాలంటే అది ప్రభుత్వం వల్ల కాదు, ప్రైవేటు వ్యక్తులు తలచుకుంటేనే అవుతుందని చెప్పడం బాబు ఉద్దేశ్యమేమో తెలియదు!! పైగా… ఈ విధానాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెబుతూ అందుకు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు.

అంతేకాదు… ఓ 33 సంవత్సరాల తర్వాత ఆ వైద్య కళాశాలలన్నీ మళ్లీ పూర్తిగా ప్రభుత్వం చేతికే వస్తాయని చెప్పారు. ఇది తన మార్క్ విజన్ పాలన అని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పారు. దీంతో… ప్రతిపక్ష వైసీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు అందుకు ప్రజలనుంచి మరింత తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కోటి సంతకాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తూర్పారబట్టారు.

ఆ సమయంలో జగన్ ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వ స్థలాల్లోని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను.. ప్రభుత్వ జీతాలతో ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తారా.. ఇంతకు మించిన అవినీతి ఉంటుందా అని చంద్రబాబును ప్రశ్నించారు జగన్.

ఇదే సమయంలో… తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి తీరుతామని గట్టిగా చెప్పారు. దీంతో… ప్రభుత్వం ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా, ఏ ప్రైవేటు సంస్థలూ ముందుకు రాలేదు! వచ్చినట్లు ప్రచారం జరిగినా… తర్వాత ‘తూచ్’ అనే రియాక్షన్ వచ్చిన పరిస్థితి!

ఇదే సమయంలో… రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత ఏడాది అక్టోబర్ 10 నుంచి నవంబరు 26 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు, కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. ఆ సంతకాల ప్రతులను గవర్నర్ కు పంపడం.. దీంతో కూటమి ప్రభుత్వం సైలంట్ అయినట్లు కనిపించడం తెలిసిందే.

కట్ చేస్తే… మరోసారి చంద్రబాబు ఈ విషయంపై తాజాగా స్పందించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌ పరం చేయాలని.. వీటికి సంబంధించిన పనులు నెల రోజుల్లో ప్రారంభమవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

ఇందులో భాగంగా… ఫేజ్ 1లో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని.. ఫెజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కాలేజీలు పీపీపీకి అప్పగించి, పనులు ప్రారంభించాలని చంద్రబాబు మరోసారి అధికారులకు సూచించారు.

వాట్ నెక్స్ట్ జగన్..?:

ఈ విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటి అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రవేటుపరం చేయాలని చంద్రబాబు మరోసారి నిర్ణయించుకుని, అధికారులకు ఆదేశాలివ్వడంపై ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… ఈసారి చంద్రబాబు పీపీపీని జగన్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇది గతంలోకంటే బలంగా ఉంటుందా లేదా అనే చర్చా మొదలైంది.

తొలుత గత ఏడాది చంద్రబాబు ఈ ఆలోచన చేసినప్పుడు జగన్ చాలా ధీటుగా స్పందించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజారోగ్యానికి తీరని నష్టమని చెబుతూ… పేదలకు ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అని మండిపడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, స్వచ్చంధ సంస్ధలు, విద్యార్ధులు, మేధావులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయాల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఇదే సమయంలో కోటి సంతకాలను సేకరించి, గవర్నర్ కు పంపించారు. పేదలకు మంచి వైద్యం అందించడానికే తాను గతంలో ఎన్నడూ లేని రీతిలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే.. చంద్రబాబు మాత్రం పేద ప్రజల ఆరోగ్యాన్ని, పేదల వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఫైరయ్యారు! దీంతో.. ఆ వ్యవహారం సద్దుమణిగిపోయినట్లు కనిపించింది. అయితే… చంద్రబాబు మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు.

దీంతో… ప్రస్తుతం కడప పర్యటనలో ఉన్న జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతారా.. ఎమ్మార్వోలకు, కలెక్టర్ లకు వినతిపత్రాలు ఇస్తారా.. మళ్లీ కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు చేపడతారా అనేది ఆసక్తిగా మారింది.

అలా కాకుండా.. ప్రెస్ మీట్ పెట్టి… “పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకోవాలని ఎవరైనా ముందుకు వస్తే.. తన ప్రభుత్వం వచ్చిన తర్వాత”… అని ఒక స్పష్టమైన సందేశం ఇస్తారా అనేది వేచి చూడాలి!

ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… జగన్ ఇప్పటికే ఈ విషయంపై ఓ సారి గట్టిగా చెప్పిన నేపథ్యంలో… మరోసారి చంద్రబాబు పీపీపీ అంశాన్ని తెరపైకి తెచ్చిన తరుణంలో… ఏయే ప్రైవేటు సంస్థలు ఈ విషయంలో ముందుకు వస్తాయనేది మరింత ఆసక్తిగా మారింది.

దీనికి అధికారులకు చంద్రబాబు ఇచ్చిన గడువు నెల రోజుగా ఉంది!! ఈసారి కూడా ఏ ప్రైవేటు సంస్థా ఈ విషయంలో ముందుకు రాకపోతే..? అనే ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి! మరి ఈ విషయంలో జగన్ ముందుకు వస్తారా.. లేక, ప్రైవేటు సంస్థలే ముందుకు వస్తాయా అనేది వేచి చూడాలి.